సోనియా గాంధీని కలవనున్న తేజస్వీ యాదవ్

Tejashwi Yadav to meet Sonia Gandhi on Friday. గురువారం సాయంత్రం దేశ రాజధానికి చేరుకున్న బీహార్ ఉప ముఖ్యమంత్రి

By Medi Samrat  Published on  12 Aug 2022 9:04 AM GMT
సోనియా గాంధీని కలవనున్న తేజస్వీ యాదవ్

గురువారం సాయంత్రం దేశ రాజధానికి చేరుకున్న బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఈరోజు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవనున్నారు. ఆగస్ట్ 24న బీహార్ అసెంబ్లీలో బలపరీక్ష ఉన్న నేప‌థ్యంలో ఈ భేటీ ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. రక్షా బంధన్ వేడుకల కోసం తేజస్వి యాదవ్ ఢిల్లీకి వచ్చారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో కూడా సమావేశమై బీహార్‌లో ఇటీవలి పరిణామాలపై చర్చించనున్నారు.

నితీష్ కుమార్ బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ నుండి విడిపోయి.. మహాఘటబంధన్‌లో చేరిన తర్వాత సోనియా గాంధీతో తేజస్వికి ఇది మొదటి సమావేశం. మహాఘట్‌బంధన్‌తో నితీష్ కుమార్ బంధాన్ని "ఒక సహజ కూటమి, ఒప్పందం కాదు" అని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. బీహార్ ఒక నెలలోపు ఎక్కువ సంఖ్య‌లో ప్రభుత్వ ఉద్యోగాలు అందించే అతిపెద్ద రాష్ట్రంగా అవతరించనుందని పేర్కొన్నారు.

దేశ రాజధానిలో విలేకరులతో మాట్లాడిన తేజస్వి, "ఇది సహజమైన కూటమి, ఒప్పందం కాదు. లాలూ యాదవ్‌, నితీష్‌ కుమార్‌లు కలిసి ఏర్పడిన అసలైన 'మహాగత్‌బంధన్‌' ఇదే. మేము నితీష్ కుమార్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము. అందుకే ఆయ‌న‌తో కలిసి వచ్చామని అన్నారు. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్న హామీలను నెరవేర్చే విష‌య‌మై డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. అసెంబ్లీలో విశ్వాస తీర్మానం తర్వాతే అది జరుగుతుందని చెప్పారు.

"మేము బీజేపీ తరహా రాజకీయాలు చేయడం లేదు, మేము నాయకులను బెదిరించి కొనుగోలు చేయం. ఉద్యోగాలు కల్పిస్తాం, విశ్వాస తీర్మానం జరగనివ్వండి. మేము ఈ సమస్యపై చాలా సీరియస్‌గా ఉన్నాము. ఒక నెలలో.. బీహార్ ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చే పెద్ద‌ రాష్ట్రంగా అవతరించడాన్ని మీరు చూస్తారు, "అని ఆయన అన్నారు.

ఇదిలా వుంటే బీహార్‌లో కొత్త సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని మహాఘటబంధన్ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోవడానికి ఆగస్టు 24 న బలపరీక్షకు వెళ్లనుంది.





Next Story