తాజ్ మహల్ సందర్శకులకు షాక్.. పెరిగిన టికెట్ ధర!
Taj Mahal ticket prices likely to increase for tourists. తాజ్మహల్ సందర్శనకు టికెట్ ధరను పెంచాలని నిర్ణయించింది ఆగ్రా అధికార యంత్రాంగం.
By Medi Samrat
జీవితంలో ఒక్క సారైనా తప్పక చూడాల్సిన కట్టడాల్లో అందమైన తాజ్ మహల్ ఒకటి. ఆగ్రాలోని ఈ అపురూపమైన స్మారకాన్ని సందర్శించేందుకు దేశ విదేశీ టూరిస్టులు వస్తుంటారు. ప్రపంచంలో ఏడు వింతల్లో ఒకటి తాజ్ మహల్. భారతీయ, ఇస్లామిక్, పర్షియన్ నిర్మాణ శైలిలో రూపుదిద్దుకున్న ఈ కట్టడాన్ని 22 సంవత్సరాల పాటు కష్టించి నిర్మించారు. తాజ్ మహల్ ను చూసిన తర్వాత ప్రపంచంలో ఇటువంటి నిర్మాణం మరెక్కడా చూడలేం అనే భావన కలుగుతుంది.
షాజహాన్ తన మూడవ భార్య ముంతాజ్ మహల్ పై ప్రేమకు గుర్తుగా తాజ్ మహల్ ను నిర్మించాడనే విషయం అందరికీ తెలిసిందే. ముంతాజ్ మహల్ పేరు మీదే ఈ కట్టడానికి తాజ్ మహల్ అనే పేరు ఏర్పడింది. ప్రేమికుల చిహ్నంగా తాజ్ మహల్ ని ఎన్నో చిత్రాల్లో చూపించారు.. కవులు తమ కవితల్లో వినిపించారు. అయితే గత ఏడాది కరోనా నేపథ్యంలో తాజ్ మహల్ సందర్శనకు అనుమతి ఇవ్వలేదు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత మళ్లీ సందర్శకులకు పర్మిషన్ ఇచ్చారు. తాజాగా ప్రఖ్యాత కట్టడం తాజ్మహల్ సందర్శనకు టికెట్ ధరను పెంచాలని నిర్ణయించింది ఆగ్రా అధికార యంత్రాంగం. స్వదేశీ పర్యటకులకు రూ. 30, విదేశీ పర్యటకులకు రూ.100 టికెట్ ధరను పెంచుతున్నట్లు పేర్కొంది.
ఇంతకుముందు తాజ్ మహల్ ను సందర్శించేందుకు స్వదేశీ పర్యటకులు రూ. 50, విదేశీ పర్యటకులు రూ. 1100 చెల్లించేవారు. తాజ్ మహల్ డోమ్ ను ప్రత్యేకంగా సందర్శించించేవారికి రూ. 200 ఛార్జ్ విధించనున్నట్లు ఆగ్రా అభివృద్ధి అథారిటీ పేర్కొంది. అయితే.. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) కూడా ప్రధాన డోమ్ ను సందర్శించే పర్యటకుల నుంచి రూ. 200 టికెట్టు ధర వసూలు చేస్తుందని ఆగ్రా డివిజనల్ కమిషనర్ అమిత్ గుప్తా స్పష్టం చేశారు.పెంచిన టికెట్టు ధర ప్రకారం... మెయిన్ డోమ్ ను సందర్శించే స్వదేశీయులు రూ. 480, విదేశీ యాత్రికులు రూ. 1600 చెల్లించాల్సి ఉంది.