స్పైస్జెట్పై సైబర్ ఎటాక్.. సేవలకు అంతరాయం
SpiceJet faces Ransomware attack.ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్జెట్ పై మంగళవారం రాత్రి సైబర్ దాడి జరిగింది.
By తోట వంశీ కుమార్
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్జెట్ పై మంగళవారం రాత్రి సైబర్ దాడి జరిగింది. దీంతో ఆ సంస్థకు చెందిన పలు విమానాల రాకపోకలపై దీని ప్రభావం పడింది. గుర్తు తెలియని దుండగులు చేసిన సైబర్దాడి వల్లే ఇలా జరిగిందని ఆసంస్థ ఓప్రకటనలో తెలిపింది. ఇది ర్యాన్సమ్వేర్ వైరస్ దాడని చెప్పింది.
సైబర్ దాడి కారణంగా ఉదయం విమానాల రాకపోకలపై ప్రభావం చూపింది. వెంటనే తమ ఐటీ బృందం సమస్యను గుర్తించి పరిష్కరించిందని తెలిపింది. ప్రస్తుతం విమానాలు యథావిధిగా నడుస్తున్నాయని బుధవారం 8.30గంటల సమయంలో వెల్లడించింది. కాగా.. దీనిపై ప్రయాణీకులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి సమాచారం తెలియజేయలేదని మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా సంస్థపై విమర్శలు గుప్తించారు. గంటల తరబడి విమానాశ్రయాల్లో వేచి ఉండాల్సి వచ్చిందని అసహనం వ్యక్తం చేశారు.
#ImportantUpdate: Certain SpiceJet systems faced an attempted ransomware attack last night that impacted and slowed down morning flight departures today. Our IT team has contained and rectified the situation and flights are operating normally now.
— SpiceJet (@flyspicejet) May 25, 2022
ర్యాన్సమ్వేర్ అంటే ఏమిటి..?
ర్యాన్సమ్వేర్ అనేది వైరస్లలో ఒక రకానికి చెందినది. ఇది కంప్యూటర్లోకి ప్రవేశించాక యూజర్కు చెందిన ఫైల్స్ అన్నింటినీ లాక్ చేస్తుంది. ఈ క్రమంలో యూజర్ ఒక వేళ ఆ ఫైల్స్ను ఓపెన్ చేయాలని చూస్తే అప్పుడు అవి ఓపెన్ కావు. పైగా ఫైల్స్ లాక్ అయ్యాయని, కొంత డబ్బు కడితేనే ఆ ఫైల్స్ మళ్లీ అన్లాక్ అయి ఓపెన్ అవుతాయని, వీలైనంత త్వరగా డబ్బు కట్టకపోతే ఫైల్స్ అనీ ఎరేజ్ అవుతాయని ఓ మెసేజ్ కంప్యూటర్ తెరపై ప్రత్యక్షమవుతుంది.