మ‌ధ్యాహ్న భోజ‌నంలో పాము.. 30 మంది చిన్నారుల‌కు తీవ్ర అస్వ‌స్థ‌త‌

Snake Found In Mid-Day Meal In Bengal, Several Children Fall Ill.విద్యార్థులు తినే మ‌ధ్యాహ్నా భోజ‌నంలో పాము

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Jan 2023 6:45 AM GMT
మ‌ధ్యాహ్న భోజ‌నంలో పాము.. 30 మంది చిన్నారుల‌కు తీవ్ర అస్వ‌స్థ‌త‌

విద్యార్థులు తినే మ‌ధ్యాహ్నా భోజ‌నంలో పాము క‌నిపించింది. ఆ విష‌యం తెలియ‌కుండా భోజనం చేసిన చిన్నారులు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైయ్యారు. వెంట‌నే చిన్నారుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రంలోని బీర్పూమ్ జిల్లాలో జ‌రిగింది.

జిల్లాలోని మయూరేశ్వర్‌బ్లాక్‌లోని ప్రాథమిక పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజనం తిన్న సుమారు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. విద్యార్థుల‌కు వ‌డ్డించిన పప్పు గిన్నెలో పాము క‌నిపించింద‌ని భోజ‌నం సిద్దం చేసిన సిబ్బంది కూడా తెలిపారు. భోజ‌నం చేసిన త‌రువాత పిల్లలకు వాంతులు కావ‌డంతో అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది వెంట‌నే చిన్నారుల‌ను రామ్‌పూర్‌హట్ మెడికల్ కాలేజీ మరియు ఆసుపత్రికి త‌ర‌లించారు.

మధ్యాహ్న భోజనం తిని చిన్నారులు అస్వస్థతకు గురవుతున్నట్లు పలు గ్రామాల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ దీపాంజన్ జానా తెలిపారు. "జనవరి 10న సందర్శించే ప్రాథమిక పాఠశాలల జిల్లా ఇన్‌స్పెక్టర్‌కు నేను తెలియజేసాను" అని జానా చెప్పారు. అస్వ‌స్థ‌త‌కు గురైన చిన్నారుల్లో ఒక‌రు త‌ప్పా అంతా డిశ్చార్జ్ అయ్యార‌ని అధికారులు వెల్ల‌డించారు. కాగా.. దీనిపై స్థానికుల నుంచి తీవ్ర నిర‌స‌న వ్య‌క్తమైంది. పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయుడిని ఘెరావ్ చేస్తూ అత‌డి బైక్‌ను ధ్వంసం చేశారు.

Next Story