26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటన తర్వాత భారత ప్రభుత్వం 16 పాకిస్తానీ యూట్యూబ్ ఛానెల్లను నిషేధించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 3.5 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లతో ఉన్న ప్రముఖ క్రికెటర్ షోయబ్ అక్తర్ యూట్యూబ్ ఛానెల్ను కూడా నిషేధించారు.
డాన్ న్యూస్, సమా టీవీ, ARY న్యూస్, బోల్ న్యూస్, రఫ్తార్, జియో న్యూస్, సునో న్యూస్ వంటి ప్రధాన పాకిస్తానీ వార్తా ఛానెల్ల యూట్యూబ్ ఛానల్స్ కూడా బ్లాక్ అయ్యాయి. ఇర్షాద్ భట్టి, అస్మా షిరాజీ, ఉమర్ చీమా, మునీబ్ ఫరూక్ వంటి జర్నలిస్టులు నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానెల్లు కూడా భారతీయ వినియోగదారుల కోసం బ్లాక్ చేశారు. ఈ లిస్టులో ది పాకిస్తాన్ రిఫరెన్స్, సమా స్పోర్ట్స్, ఉజైర్ క్రికెట్, రజి నామా వంటి ఇతర నిషేధిత ఛానెల్లు ఉన్నాయి.
ఏప్రిల్ 22న పహల్గామ్ విషాదంలో భారతీయులు దారుణ హత్యకు గురైన తరువాత, ఈ ఛానెల్లు తప్పుడు సమాచారం, తప్పుడు కథనాలు, మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి రూపొందించిన కంటెంట్ను వ్యాప్తి చేస్తున్నాయని తేలడంతో హోం మంత్రిత్వ శాఖ సిఫార్సుల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.