కూలిన శివాల‌యం.. శిథిలాల కింద ప‌లువురు భ‌క్తులు..!

Shiva temple crumbles after JCB collision in Rajasthan's Karauli. కరౌలిలోని సపోత్రా పట్టణంలో జేసీబీ యంత్రం ఢీకొనడంతో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Jan 2023 7:21 AM GMT
కూలిన శివాల‌యం.. శిథిలాల కింద ప‌లువురు భ‌క్తులు..!

రాజ‌స్థాన్ రాష్ట్రంలోని కరౌలిలోని సపోత్రా పట్టణంలో జేసీబీ యంత్రం ఢీకొనడంతో ఆలయం కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో ఆలయంలో పూజలు చేస్తున్న ఇద్దరు మహిళలు శిథిలాల కింద చిక్కుకున్నారు. స్థానికంగా ఉన్న వ్యక్తులు మహిళలను బయటకు తీసి సపోత్రా ఆసుపత్రిలో చేర్పించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా మారడంతో కరౌలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకుపోయి ఉంటారని ఆందోళన వ్యక్తం చేశారు.

సపోత్ర పట్టణంలో పీడబ్ల్యూడీ శాఖ ఆధ్వర్యంలో డ్రెయిన్‌ను నిర్మిస్తున్నట్లు సమాచారం. మంగళవారం ఉదయం పట్టణంలోని నారోలి మలుపులో డ్రెయిన్‌ కోసం జేసీబీతో తవ్వే పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జేసీబీ ఢీకొనడంతో శివాలయం కూలిపోయింది. ఆ సమయంలో కాంతి దేవి (48), సీమ (28)ల‌తో పాటు కంజి లాల్ ఆలయంలో పూజలు చేస్తున్నారు.

ఆలయం కూలిన వెంటనే పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. శిథిలాల‌ను తొలగించి వారిని బయటకు తీసి సపోత్ర ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉండటంతో జైపూర్‌కు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే ఎస్‌డిఎంతో పాటు పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు.

సివిల్‌ డిఫెన్స్‌ బృందం కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాద సమాచారం అందుకున్న కలెక్టర్ అంకిత్‌కుమార్‌ సింగ్‌, ఎస్పీ నారాయణ్‌ తోగస్‌ ఘటనాస్థలికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

నరౌలి మోర్ వద్ద ఆలయం ముందు ఉన్న శీతల పానీయాల దుకాణం యజమాని సురేష్ గుప్తా మాట్లాడుతూ.. కొంతమంది మహిళలు ఉదయం ఆలయంలో పూజలు చేస్తున్నారని చెప్పారు. ఈ సమయంలో ఎటువంటి సమాచారం లేకుండా జెసిబి తవ్వకం ప్రారంభించబడింద‌ని, దీని కారణంగా ఆలయం కూలిపోయిందని చెప్పాడు. మ‌రికొంద‌రు భ‌క్తులు ఉన్న‌ట్లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్న నేప‌థ్యంలో శిథిలాల తొల‌గింపు ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేశారు.

Next Story