శరద్ పవార్ కు తీవ్ర అస్వస్థత..!
Sharad Pawar in hospital after abdominal pain. ఎన్సీపీ అధినేత, మాజీ కేంద్రమంత్రి శరద్ పవార్ అనారోగ్యానికి గురయ్యారు.
By Medi Samrat
ఎన్సీపీ అధినేత, మాజీ కేంద్రమంత్రి శరద్ పవార్ అనారోగ్యానికి గురయ్యారు. ఆయన వయసు 80 సంవత్సరాలు..! శరద్ పవార్ అనారోగ్యంతో బాధ పడుతున్నారని ఎన్సీపీ నేతలు తెలిపారు. అంతేకాకుండా ఆయన శస్త్రచికిత్స కోసం బుధవారం ఆసుపత్రిలో చేరనున్నారని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. హోం మంత్రి అమిత్ షాతో శరద్ పవార్ రహస్య మంతనాలు జరిపారంటూ పుకార్లు షికార్లు చేస్తున్న సమయంలో ఆయన అనారోగ్యం పాలయ్యారనే వార్త ప్రస్తుతం కార్యకర్తలను ఆందోళనకు గురి చేస్తోంది.
స్వల్పంగా కడుపునొప్పి రావడంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించగా, పిత్తాశయంలో రాళ్లు ఉన్నట్టుగా తేలిందని ఎన్సీపీ నేతలు తెలిపారు. దీంతో తదుపరి సమాచారం అందించేంత వరకు ఆయన కార్యక్రమాలన్నీ రద్దైనట్టు మాలిక్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం బ్లడ్ థిన్నర్ (రక్తం గడ్డకట్టకుండా వుండే) మందులు వాడుతున్న నేపథ్యంలో 2021, మార్చి 31న ఆసుపత్రిలో చేరతారని, ఎండోస్కోపీ , అనంతరం శస్త్రచికిత్స జరగనుందని వెల్లడించారు. హోం మంత్రి అమిత్ షా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మధ్య కీలక భేటీ జరిగిందంటూ మీడియాలో వస్తున్న వార్తలను ఎన్సీపీ ఖండించింది. అలాంటిదేమీలేదని, ఇదంతా బీజేపీ రాజకీయ ఎత్తుగడలో భాగమని కొట్టి పారేసింది. పవార్ గతంలో క్యాన్సర్ బారిన పడి కోలుకున్నారు.. ఇప్పుడు ఇలా ఆయనకు శస్త్ర చికిత్స చేయాలనే వార్త ఆయన అభిమానుల్లో కలవరాన్ని రేపుతోంది.