సీరమ్ నుండి సంచలన ప్రకటన.. మరో వ్యాక్సిన్ కూడా..!
Serum Institute seeks approval to conduct local trial for Novavax Covid vaccine. భారతదేశంలో మరో కరోనా వ్యాక్సిన్ ట్రయల్ కోసం సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా దరఖాస్తు చేయడం విశేషం.
By Medi Samrat
భారత్లో పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతోన్న వ్యాక్సిన్లపై ఐక్యరాజ్య సమితి ప్రశంసల జల్లు తాజగా కురిపించిన సంగతి తెలిసిందే. ప్రపంచానికి వ్యాక్సిన్లను అందించడంలో భారత్ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ అన్నారు. పెద్ద మొత్తంలో వ్యాక్సిన్లను తయారు చేసే భారత్ సామర్థ్యం ప్రపంచానికే ఓ పెద్ద ఆస్తి అంటూ ఆయన ప్రశంసించారు. భారత్లోని వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆంటోనియో గుటెర్రస్ చెప్పారు. ప్రపంచానికి వ్యాక్సిన్ను అందించేందుకు భారత్ కూడా సిద్ధంగా ఉందని.. వీలైనంత త్వరగా వ్యాక్సిన్లను అందించే దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రపంచంలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ల తయారీ లైసెన్స్లను ఆయా సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రాలకు బదిలీ చేయాలని ఆంటోనియో గుటెర్రస్ పిలుపునిచ్చారు.
ఇలా ప్రశంసలు అందుకుంటున్న సమయంలో భారతదేశంలో మరో కరోనా వ్యాక్సిన్ ట్రయల్ కోసం సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా దరఖాస్తు చేయడం విశేషం. ఆక్స్ ఫర్డ్– ఆస్ట్రాజెనికా కలిసి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ను కొవిషీల్డ్ పేరుతో మన దేశంలో సీరమ్ మార్కెట్ చేస్తోంది. రెండు వారాల క్రితమే ఆ టీకా పంపిణీ కూడా మొదలైంది. తాజాగా అమెరికాకు చెందిన నోవావ్యాక్స్ అనే కంపెనీ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ కోసం సీరమ్ దరఖాస్తు చేసుకుంది. ఈ విషయాన్ని సీరమ్ సంస్థ సీఈవో అదర్ పూనావాలా శుక్రవారం వెల్లడించారు. బ్రిటన్ లో నిర్వహించిన మూడో దశ ట్రయల్స్ లో టీకా 89.3 శాతం వరకు సత్ఫలితాలనిచ్చినట్టు నోవావ్యాక్స్ వెల్లడించిన కొన్ని గంటలకే మన దేశంలోనూ ట్రయల్స్ కు దరఖాస్తు చేశారు.
ప్రపంచంలోని పలు దేశాలకు భారత్ భారీగా వ్యాక్సిన్లను అందిస్తోంది. ఇప్పటికే భారత పొరుగు దేశాలకు లక్షలాది డోసులను భారత్ సరఫరా చేసింది. ఇప్పటి వరకు వివిధ దేశాలకు భారత్ మొత్తం 55 లక్షల డోసులను పంపింది.