Schools, Colleges in Maharashtra's Pune to Remain Shut Till March 14. మహారాష్ట్రలో కరోనా కేసులు ఇటీవలి కాలంలో విపరీతంగా పెరుగుతూ ఉండడంతో స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లను మూసివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
By Medi Samrat Published on 28 Feb 2021 11:06 AM GMT
మహారాష్ట్రలో కరోనా కేసులు ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోతూ ఉన్న సంగతి తెలిసిందే..! మాహారాష్ట్ర ప్రభుత్వం కూడా కరోనా కేసులను తగ్గించడానికి చాలా ప్రయత్నాలను చేస్తూ ఉంది. మహారాష్ట్రలోని ప్రధాన నగరాలలో కరోనా కేసులు పెరుగుతూ ఉండడం ప్రభుత్వాన్ని టెన్షన్ పెడుతూ ఉండగా.. పూణేలో కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లను మూసివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పుణేలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో మార్చి 14 దాకా స్కూళ్లు తెరవొద్దని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు, ఇతర విద్యాసంస్థలన్నీ మార్చి 14 దాకా మూసే ఉంటాయని పూణే మేయర్ మురళీధర్ మోహోల్ ప్రకటించారు.
రాత్రి కర్ఫ్యూను అమలు చేస్తున్నారని.. అత్యవసరాలు, నిత్యవసరాలు తప్ప రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అనుమతినివ్వబోమని మేయర్ తేల్చి చెప్పారు. ఈ మేరకు ఫిబ్రవరి 28 వరకు ప్రకటించిన నిబంధనలను మరికొద్ది రోజులు పొడిగించబోతున్నట్లు తెలిపారు. పూణెలో స్కూళ్లను జనవరిలో తెరిచారు. స్కూళ్లకు వచ్చే ముందు విద్యార్థులు, టీచర్లు విధిగా ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆ మేరకు జనవరిలో పాఠశాలలు, కాలేజీలను తెరిచారు. కేసులు మళ్లీ పెరుగుతుండడంతో ఫిబ్రవరిలో మూసేశారు. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతూ వెళితే మరోసారి కఠిన నిబంధనలను అమలు చేస్తామని తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే హెచ్చరికలు జారీ చేశారు.