డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ పవిత్ర పుణ్యక్షేత్రాలైన చార్ధామ్ యాత్రకు వెళ్లే భక్తులకు అధికారులు షాకింగ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది నుంచి యాత్ర రిజిస్ట్రేషన్ కోసం కనీస రుసుము చెల్లించాలని గర్హ్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే ప్రకటించారు. రిషికేశ్లో జరిగిన వాటాదారుల సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. మోసపూరిత రిజిస్ట్రేషన్లను అరికట్టడమే లక్ష్యంగా ఈ ఫీజును ప్రవేశపెడుతున్నామని, ఖచ్చితమైన ధరను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.
ఈ సీజన్లో భక్తుల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేకపోయినా, ప్రతి ప్రయాణికుడికి రిజిస్ట్రేషన్ మాత్రం తప్పనిసరి చేశారు. ఏప్రిల్ 19న అక్షయ తృతీయ సందర్భంగా గంగోత్రి, యమునోత్రి తలుపులు తెరవడంతో ఈ మహా యాత్ర ప్రారంభం కానుంది. అనంతరం ఏప్రిల్ 22న కేదార్నాథ్, ఏప్రిల్ 23న బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయి. ఒకటి రెండు రోజుల్లోనే అధికారిక రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుండగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.