ఇంటి పక్క నుంచి ట్రైన్ వెళుతూ ఉంటే ఆ సౌండ్ కి ఇల్లు కదిలిపోవడం సినిమాల్లోనే చూసాం. ఆ సౌండ్ కి డిస్టర్బ్ అయిపోవడం, అలవాటు పడిపోవటం గురించి కూడా తెలుసు.. కానీ వేగంగా వెళుతున్న రైలు ధాటికి పక్కనే ఉన్న రైల్వే కార్యాలయం కూలిపోవడం అనేది ఎప్పుడైనా ఊహించారా.. ఇలాంటి విచిత్ర సంఘటన మధ్యప్రదేశ్ బుర్హాన్పూర్ జిల్లాలోని నేపానగర్ - అసిఘర్ మధ్య చోటుచేసుకుంది.
పుష్పక్ ఎక్స్ప్రెస్ అధిక వేగంతో వెళ్తుండగా వచ్చిన ప్రకంపనలకు చాందినీ అనే రైల్వే స్టేషన్ భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం చోటుచేసుకోలేదు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ రైలు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. నిజానికి ఈ రైలు ప్రతీరోజూ ఇదే సమయానికి ఇదేవేగంతో వెళుతుంటుంది. పురాతనం అయినది అందుకే కూలిపోయింది అనుకోవడానికి కూడా ఏం లేదు ఎందుకంటే ఈ భవనం కట్టి 14 సంవత్సరాలే అయింది.
రైలు వెళుతున్నప్పుడు వచ్చిన ప్రకంపనలకు స్టేషన్ సూపరింటెండెంట్ కార్యాలయం కిటికీలు పగిలిపోయాయి. బోర్డులు కింద పడిపోయాయి. గోడలు కొన్ని బీటలు వారాయి, ప్లాట్ఫారంపై భవన శిధిలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. సమాచారం అందుకున్న స్థానిక రైల్వే అధికారులు తక్షణమే చాందినీ స్టేషన్కు చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను పర్యవేక్షించారు. ఈ సంఘటనతో చెన్నై రైల్వే స్టేషన్ దారిలో వెళ్లే పలు రైళ్లను దారి మళ్లించారు. ఈ ఘటనపై రైల్వే ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.