'నా యాత్రను ఆపడానికే కరోనా సాకు'.. కేంద్రం లేఖపై రాహుల్‌ కామెంట్స్‌

Rahul Gandhi responded to the Centre's 'Stop Bharat Jodo Yatra' note. జాతీయ కాంగ్రెస్‌ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర విజయవంతంగా సాగుతోందని, అయితే యాత్రను

By అంజి  Published on  22 Dec 2022 1:57 PM GMT
నా యాత్రను ఆపడానికే కరోనా సాకు.. కేంద్రం లేఖపై రాహుల్‌ కామెంట్స్‌

జాతీయ కాంగ్రెస్‌ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర విజయవంతంగా సాగుతోందని, అయితే యాత్రను ఆపడానికి కోవిడ్‌ను కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ సాకుగా చూపిస్తోందని అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. యాత్రను నిలిపివేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖ రాసిన ఒక రోజు తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడారు. కోవిడ్ ప్రోటోకాల్‌లను అనుసరించడం సాధ్యం కాదన్నారు. ''ఇది వారి (బీజేపీ) కొత్త ఆలోచన. కోవిడ్ వస్తోందని, యాత్రను ఆపేయమని వారు నాకు లేఖ రాశారు. ఈ యాత్రను ఆపడానికి ఇవన్నీ సాకులు. వారు భారతదేశ సత్యానికి భయపడుతున్నారు'' అని రాహుల్ గాంధీ అన్నారు.

''యాత్రను ఆపడానికి ఇవన్నీ సాకులు.. ఈ వ్యక్తులు (బీజేపీ) భయపడుతున్నారు. అదే నిజం. వారు మమ్మల్ని ఆపాలనుకుంటున్నారు. భారతదేశం శక్తికి వారూ భయపడుతున్నారు. మేము వందల కిలోమీటర్లకు పైగా నడిచాము. హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, మహిళలు, పురుషులు, పిల్లలు అందరూ మాతో చేరారు. యాత్ర జమ్మూ కాశ్మీర్‌కు వెళ్తుంది'' అని రాహుల్‌ గాంధీ చెప్పారు. భారత్ జోడో యాత్రలో కోవిడ్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని, మాస్క్‌లు, శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా బుధవారం రాహుల్ గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌లకు లేఖ రాశారు.

ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకున్న మంత్రి మన్సుఖ్ మాండవియా, కోవిడ్ ప్రోటోకాల్‌లను అనుసరించడం సాధ్యం కాకపోతే, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా యాత్రను వాయిదా వేయాలని కూడా అన్నారు. టీకాలు వేసిన వారు మాత్రమే భారత్ జోడో యాత్రలో పాల్గొనాలి. కోవిడ్ నిబంధనలను అనుసరించండి లేదా యాత్రను నిలిపివేయండి అని లేఖలో పేర్కొన్నారు. ఈ నోట్‌పై కాంగ్రెస్ స్పందిస్తూ.. భారత్ జోడో యాత్ర విజయవంతం కావడం వల్లే కేంద్రం ఈ రకంగా కుట్ర చేస్తోందని ఆరోపించింది. రాజస్థాన్, కర్ణాటకలలో బీజేపీ ర్యాలీల నిర్వాహకులకు ఆరోగ్య మంత్రి లేఖలు పంపారా అని గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌ ప్రశ్నించింది.


Next Story