వయనాడ్‌ నుంచి నామినేషన్ దాఖలు చేసిన రాహుల్‌గాంధీ

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  3 April 2024 10:00 AM GMT
rahul gandhi, nomination,  wayanad, kerala, congress,

 వయనాడ్‌ నుంచి నామినేషన్ దాఖలు చేసిన రాహుల్‌గాంధీ

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. వయనాడ్‌ నుంచి రాహుల్‌గాంధీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో కూడా మరోసారి రాహుల్‌గాంధీ వయనాడ్ నుంచే బరిలో దిగుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బుధవారం వయనాడ్‌ నుంచి కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేవారు. ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో రాహుల్‌ గాంధీతో పాటు ఆయన సోదరి ప్రియాంక గాంధీ, ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌, ఇతర పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

నామినేషన్‌ దాఖలుకి ముందు వయనాడ్‌కు చేరుకున్నారు రాహుల్‌ గాంధీ. ముందుగా కాల్‌పేట ఉంచి సివిల్‌ స్టేషన్ వరకు భారీ రోడ్‌షో నిర్వహించారు. ఈ రోడ్‌షోలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. రాహుల్‌ గాంధీకి మద్దతు పలికారు. తాను ఎప్పుడూ వయనాడ్‌ ప్రజలకు సపోర్ట్‌గా ఉంటానని చెప్పారు రాహుల్‌గాంధీ. వయనాడ్‌ లోని ప్రతి వ్యక్తి తనపై ప్రేమ, అభిమానాన్ని అందించారని గుర్తు చేసుకున్నారు. సొంత వ్యక్తిలా చూసుకున్నారని అన్నారు. ఇక వయనాడ్‌ నుంచి లోక్‌సభ అభ్యర్థిగా తాను పోటీ చేస్తుండటం గౌరవంగా భావిస్తున్నానని రాహుల్‌గాంధీ చెప్పారు.

ఇక నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్‌గాంధీ.. అధికార పార్టీ బీజేపీపై మండిపడ్డారు. ఎన్నికలు ప్రజాస్వామ్యం కోసం, భారత రాజ్యాంగం కోసం జరుగుతోన్న పోరు అని చెప్పారు. దేశ ప్రజాస్వామ్యాన్ని, దేశ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఒక వైపు విధ్వంసాలు చేయాలనుకునే వారు.. మరోవైపు తాము రాజ్యాంగాన్ని పరిరక్షించాలనుకునే వాళ్లు ఉన్నట్లు చెప్పారు. ప్రజలు ఎటువైపు ఉంటారో స్పష్టంగా తెలిసిపోతుందని రాహుల్‌ గాంధీ అన్నారు.

కాగా.. గత 2019 ఎన్నికల్లో వయనాడ్‌ నుంచి రాహుల్‌గాందీ 7 లక్షల మెజార్టీతో గెలిచారు. సమీప అభ్యర్థిగా సీపీఐ క్యాండెట్ సునీర్‌ నిలిచారు. ఇక తాజాగా ఇదే వయనాడ్‌ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్‌, సీపీఐ అభ్యర్థిగా అనీ రాజా పోటీలో ఉన్నారు. ఇక్కడ రెండో విడతలో భాగంగా ఏప్రిల్ 26న లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి. ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి.

Next Story