విమానం కాదు.. కనీసం రైలు టికెట్‌కు కూడా డబ్బుల్లేవ్: రాహుల్‌గాంధీ

దేశంలో లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.

By Srikanth Gundamalla  Published on  21 March 2024 9:59 AM GMT
rahul gandhi, lok sabha election, campaign, congress ,

విమానం కాదు.. కనీసం రైలు టికెట్‌కు కూడా డబ్బుల్లేవ్: రాహుల్‌గాంధీ

దేశంలో లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. వరుసగా అధికారాన్ని నిలుపుకొనేందుకు.. ఎన్డీఏ ప్రభుత్వం వ్యూహాలను రచిస్తోంది. ప్రచారంలో అగ్ర నాయకులంతా జోరుగా పాల్గొంటున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రచారం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాము ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోతున్నామని చెప్పారు. ప్రచారం కోసం తమ నాయకులను ఎక్కడికీ పంపించలేక పోతున్నామని చెప్పారు.

దీనికి కారణం కూడా రాహుల్‌ గాంధీ వెల్లడించారు. విమాన ప్రయాణాలను పక్కన పెట్టామనీ.. కనీసం రైలు టికెట్లు కొనుక్కొనేందుకు కూడా తమ వద్ద డబ్బు లేదని రాహుల్‌ గాంధీ చెప్పారు. దాంతోనే తమ నేతలను ఎక్కడికీ ప్రచారం కోసం పంపించలేకపోతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను ఫ్‌రీజ్‌ చేశారని చెప్పారు. ఎన్నికల బాండ్ల అంశంపై కూడా రాహుల్‌ గాంధీ మాట్లాడారు. పార్టీని దెబ్బతీసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర చర్యలకు పాల్పడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల సమయంలో డబ్బులు లేకపోవడంతో ప్రచారం కూడా చేసుకోలేని స్థితిలో ఉన్నామని రాహుల్‌గాంధీ చెప్పారు. తమ పార్టీ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేయడం అంటే భారత ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోవడమే అని చెప్పారు. ప్రస్తుతం మన దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా చేస్తున్నారంటూ ఎన్డీఏ ప్రభుత్వంపై రాహుల్‌ గాంధీ ఫైర్ అయ్యారు.

దేశంలో దాదాపు 20 శాతం మంది ఓటర్లు తమకు మద్దతుగా ఉన్నారని ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ చెప్పారు. కానీ తాము రెండు రూపాయలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నట్లు ఆవేదన చెందారు. తాము ఎన్నికల్లో పోరాడకుండా తమ సామర్థ్యాన్ని అడ్డుకుంటున్నారంటూ ఎన్డీఏ ప్రభుత్వంపై రాహుల్‌ గాంధీ ఆరోపణలు చేశారు. ఇక ఇదే అంశంపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్‌ ఇండియాకు ఫిర్యాదు చేశామనీ.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాహుల్‌ గాంధీ తెలిపారు.

Next Story