కరోనా కట్టడి విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న ఢిల్లీ సీఎం.. మిగిలిన వాళ్లు కూడా..!

Protests, Public Gatherings Prohibited Due To Covid Surge. భారతదేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్న సంగతి తెలిసిందే..!

By Medi Samrat  Published on  24 March 2021 2:43 PM GMT
Protests, Public Gatherings Prohibited Due To Covid Surge
భారతదేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్న సంగతి తెలిసిందే..! ఎలాగైనా కరోనాను కట్టడి చేయాలని ప్రభుత్వాలు యోచిస్తూ ఉన్నాయి. ఇక కరోనా కట్టడి విషయంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కాస్త దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నారు. పలు విషయాల్లో జాగ్రత్తలు వహించడమే కాకుండా టెస్టుల విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఢిల్లీ పరిధిలో గడచిన 24 గంటల్లో కొత్తగా 1,101 కరోనా కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 19 తరువాత రోజువారీ కేసులు ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి కావడంతో ప్రభుత్వ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,000 దాటింది. మంగళవారం నాడు నమోదైన కేసుల్లో 795 కేసులు యూకే, బ్రెజిల్, సౌతాఫ్రికా వేరియంట్లవేనని ఉన్నతాధికారులు వెల్లడించారు.


కరోనా కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చేవారికి ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్లు, బస్టాండుల్లో ర్యాండమ్ టెస్టులు చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా రెండో దశ కొనసాగుతుండగా, ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. హోలీ, షాబ్ - ఈ- బారాత్, నవరాత్రి ఉత్సవాలను బహిరంగంగా జరుపుకోవడాన్ని నిషేధిస్తున్నట్టు స్పష్టం చేసింది. మార్కెట్లు, మాల్స్ తదితర చోట్ల మాస్క్ లు ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరని పేర్కొంది. ప్రైవేటు బస్సులు నిలిపి ఉంచే పలు చోట్ల కూడా ర్యాండమ్ టెస్ట్ లను నిర్వహించనున్నామని, కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది.

బహిరంగ నిరసనలను, సమావేశాలను ఢిల్లీ ప్రభుత్వం నిషేధించింది. మెట్రోలు, మాల్స్, సినిమా థియేటర్ల కారణంగానే కరోనా కేసులు అధికమవుతూ ఉన్నాయని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాంతాల్లో కూడా కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టాలని యాజమాన్యాలకు సూచించారు.


Next Story