లోక్‌సభ ఎన్నికల్లో గత ఫలితాలే రిపీట్ అవుతాయ్‌: ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో 'నేషనల్‌ క్రియేటర్స్‌ అవార్డు'ల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

By Srikanth Gundamalla  Published on  8 March 2024 8:30 AM GMT
prime minister modi, national creators award, delhi,

లోక్‌సభ ఎన్నికల్లో గత ఫలితాలే రిపీట్ అవుతాయ్‌: ప్రధాని మోదీ 

ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో 'నేషనల్‌ క్రియేటర్స్‌ అవార్డు'ల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విజేతలకు ఆయన అవార్డులను అందించారు. సృజనాత్మక వీడియోలు, కథనాలతో సమాజంలో మార్పు కోసం కృషి చేసిన కంటెంట్‌ క్రియేటర్స్‌ను ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ అవార్డులను ప్రవేశపెట్టింది.

ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ.. మహిళా దినోత్సవం, శివరాత్రి పర్వదినాన ఈ అవార్డులను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. విజేతలకు తన అభినందనలను తెలిపారు. సృజనాత్మకతతో ఇవాళ ఇంత దూరం వచ్చారని పేర్కొన్నారు. దేశ భవిష్యత్‌ గురించి చర్చించేందుకే ఇక్కడ సమావేశం అయ్యామని చెప్పిన ప్రధాని.. పరిస్థితులకు అనుగుణంగా వచ్చే మార్పులను స్వీకరించాలని చెప్పారు. ప్రస్తుతం తక్కువ ధరకే డేటా, మొబైల్‌ ఫోన్లు అందుతున్నాయనీ.. తద్వారా మంచి మంచి కంటెంట్‌ క్రియేటర్లుగా మారుతున్నారంటూ పేర్కొన్నారు. క్రియేటర్లకు కూడా మంచరి అవకాశాలు లభిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

ఇక లోక్‌సభ ఎన్నికల గురించి కూడా ప్రస్తావించారు ప్రధాని మోదీ. గత ఎన్నికల్లో ఎలాగైతే ఎన్డేఏ ప్రభుత్వం విజయం సాధించిందో..ఈసారి కూడా అవే ఫలితాలు రిపీట్ అవుతాయని అన్నారు. 2014, 2019లో దేశ ప్రజలంతా బీజేపీకి మద్దతు తెలిపారని చెప్పారు. ఈసారి బీజేపీపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగిందనీ.. పాలనపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈసారి బీజేపీ క్లీన్‌ స్వీప్‌ చేయనుందని దీమా వ్యక్తం చేశారు. ఇదే తమలక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.

ఇక నేషనల్‌ క్రియేటర్స్‌ అవార్డుల కోసం 20 విభాగాల్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 1.5 లక్షల నామినేషన్లు రాగా.. 10 లక్షల మంది ఓటింగ్ చేశారు. వీరిలో నుంచి 23 మందిని విజేతలుగా ఎంపిక చేశారు. విజేతల్లో ముగ్గురు అంతర్జాతీయ క్రియేటర్లు ఉండటం విశేషం. మోస్ట్ క్రియేటివ్‌ క్రియేటర్‌ అవార్డులను మహిళల విభాగంలో శ్రద్ధ, పురుషుల విభాగంలో ఆర్జే రౌనాక్‌ అందుకున్నారు.

Next Story