వారణాసిలో అడుగుపెట్టిన ప్రధాని మోదీ

PM Modi reaches Varanasi to inaugurate Kashi Vishwanath Corridor.భారత ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో అడుగుపెట్టారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Dec 2021 6:11 AM GMT
వారణాసిలో అడుగుపెట్టిన ప్రధాని మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో అడుగుపెట్టారు. ఆయనకు ప్రజలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రారంభించేందుకు ప్రధాని మోదీ రావడంతో వారణాసి పండుగ శోభను సంతరించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం 10:30 గంటలకు వారణాసిలో దిగారు. మధ్యాహ్నానికి కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ఆయన ప్రారంభిస్తారు.

కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్ నిర్మాణానికి 800 కోట్లు ఖర్చు చేస్తున్నారు. రెండు కారిడార్లుగా కాశీ విశ్వనాథ్ ప్రాజెక్ట్ రూపొందించారు. తొలి కారిడార్‌ నేటి నుండి అందుబాటులోకి వస్తుంది. రెండో కారిడార్‌ జనవరిలో ప్రారంభించే అవకాశం ఉంది. వారణాసి ప్రాచీన చరిత్ర, కాశీ విశ్వనాథుని ఆలయం వైభోగాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ కారిడార్‌ను రూపొందించారు. వారణాసి చరిత్రను ప్రతిబింబించేలా.. మరాఠా మహారాణి అహల్యాబాయి హోల్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు. 17వ శతాబ్దంలో కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని ఆమె జీర్ణోద్ధరించారు. టెంపుల్ చౌక్, వారణాసి సిటీ గ్యాలరీ, మ్యూజియం, ఆడిటోరియాలు, భజన మందిరాలు, భక్తుల సౌకర్యాల కోసం కొత్తగా నిర్మించిన వసతి గదులు.. గోడౌలియా గేట్, భోగ్‌శాల, ఆలయ అర్చకులు, సేవకుల కోసం విశ్రాంతి కేంద్రాల వంటివి.. ఈ కారిడార్ ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించారు.

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ఢిల్లీ నుంచి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం వార‌ణాసికి చేరుకున్నారు. యూపీ ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్య‌నాథ్.. వార‌ణాసి ఎయిర్‌పోర్టులో ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికారు.

Next Story