అందరూ ఒకే చెప్తే.. జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్‌, డీజిల్‌

Petroleum products can be brought under GST if consensus reached.. Sitharaman. రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వస్తే పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావచ్చని

By అంజి  Published on  16 Feb 2023 4:16 AM GMT
అందరూ ఒకే చెప్తే.. జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్‌, డీజిల్‌

రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వస్తే పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం అన్నారు. పరిశ్రమల విభాగం పిహెచ్‌డిసిసిఐ నిర్వహించిన పోస్ట్-బడ్జెట్ ఇంటరాక్టివ్ సెషన్‌లో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రాలు అంగీకరిస్తే, పెట్రోలియం ఉత్పత్తులను జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావచ్చని అన్నారు. దీనికి కౌన్సిల్ సభ్యుల ఆమోదం అవసరమని అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులు ప్రస్తుతం జీఎస్టీ ఫ్రేమ్‌వర్క్‌లో భాగం కాదని చెప్పారు.

జీఎస్టీ కౌన్సిల్ 49వ సమావేశం ఫిబ్రవరి 18న దేశ రాజధానిలో ఆర్థిక మంత్రి సీతారామన్ అధ్యక్షతన జరగనుంది. ఈ క్రమంలోనే నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆర్థిక మంత్రి, పరిశ్రమల కెప్టెన్లతో ఇంటరాక్టివ్ సెషన్‌లో మాట్లాడుతున్న సందర్భంలో.. ఒక ప్రశ్నకు సమాధానంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కౌన్సిల్ సభ్యులు చేయాల్సిందల్లా రేటును నిర్ణయించడమని, వారు తనకు రేటు చెప్పగానే, పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తామని చెప్పారు.

ప్రభుత్వం, సంవత్సరాలుగా, ప్రజా వ్యయాన్ని పెంచడానికి కృషి చేస్తుందని, ఇది వృద్ధికి ఆజ్యం పోస్తుందని ఆమె అన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రభుత్వం మూలధన వ్యయాన్ని 33 శాతం పెంచి రూ.10 లక్షల కోట్లకు పెంచిందని సీతారామన్ తెలిపారు. అన్ని రంగాలపై ఆశించిన గుణకార ప్రభావం చూపేలా ప్రజా వ్యయం పెరుగుతూనే ఉండేలా కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తోందని ఆమె అన్నారు.

Next Story