23 లక్షల కరోనా వ్యాక్సిన్‌ డోసులు వృథా..! ఎందుకలా..?

Over 23 lakh vaccine doses gone waste in india.కరోనాను కట్టడి చేసేందుకు పలు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 March 2021 12:33 PM GMT
Over 23 lakh vaccine doses gone waste in india

కరోనాను కట్టడి చేసేందుకు పలు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ జోరుగా కొనసాగుతోంది. ఒక వైపు చాలా దేశాల్లో ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ అందుబాటులో లేదు. మరో వైపు వ్యాక్సిన్ల తయారీలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న భారత్‌లో మాత్రం ఎంతో విలువైన వ్యాక్సిన్‌ వృథా అవుతోంది. ఇప్పటి వరకు 23 లక్షలకుపైగా వ్యాక్సిన్‌ డోసులు వృథా అవుతున్నాయి.

వ్యాక్సిన్లు ఎందుకు వృథా అవుతున్నాయి

ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 7 కోవిడ్‌ వ్యాక్సిన్లు రాష్ట్రాలకు సరఫరా చేసింది. అందులో ఇప్పటి వరకు 3.46 కోట్లకుపైగా కరోనా టీకాలు లబ్దిదారులకు ఇచ్చారు. ఇక మొత్తం 6.5 మొత్తం శాతం వ్యాక్సిన్‌ డోసులు వృథా అయ్యాయి. వీటి సంఖ్య 23 లక్షలకుపైనే ఉండటం గమనార్హం. దీనికి ప్రధాన కారణంగా ఓ వ్యాక్సిన్‌ సీసా తెరిచిన తర్వాత అందులోని మొత్తం వ్యాక్సిన్‌ 4 గంటల్లోపే ఇచ్చేయాలి. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లలో కొవిషీల్డ్‌ టీకా ఒక సీసాను పది మందికి, కోవాగ్జిన్‌ టీకా ఒక సీసాకు 20 మందికి ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ సీసాను తెరిచిన తర్వాత గడువులోపు తగినంత మంది లబ్దిదారులు రాకపోవడం కారణంగా వ్యాక్సిన్‌ డోసులు వృథా అయిపోతున్నారు.

ఇప్పటి వరకు చాలా మంది వ్యాక్సిన్ అంటే కొంత భయపడుతుండటం ఈ పరిస్థితి తలెత్తడానికి కారణంగా తెలుస్తోంది. ఒక్క వ్యక్తికి 0.5 మి.మీ వ్యాక్సిన్‌ ఇస్తారు. దీనిని ఒక డోసుగా పరిగణిస్తారు. ఇలా ఒక్కో డోసును ఒక్కో సీసాలో నింపి రవాణా చేయడం చాలా కష్టం. పది, ఇరవై మందికి వచ్చేలా ఒక్కోసీసాను తయారు చేస్తున్నాయి ఆయా వ్యాక్సిన్‌ సంస్థలు. వ్యాక్సినేషన్‌ వేగం పెంచితేనే ఇప్పటికే ప్రపంచంలో అత్యంత వేగంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరుగుతున్న రెండో దేశంగా ఇండియా ఉంది. అయినా ఈ స్థాయిలో వ్యాక్సిన్‌ డోసులు వృథా కావడం ఆందోళన కలిగిస్తోంది. అందుకే గత రెండు రోజుల కిందట ప్రధాని నరేంద్రమోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. వ్యాక్సిన్‌ వృథాను అరికట్టాలని కోరారు.

వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగం పెంచడానికి నిపుణులు పలు సూచనలు చేస్తున్నాయి. వ్యాక్సినేషన్‌ సెంటర్‌కు కిలోమీటర్‌ పరిధిలో అర్హత ఉన్న లబ్దిదారులకు ఫోన్‌ చేసి పిలవాలని, కోవిడ్‌ కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ముందు వ్యాక్సిన్‌ ఇవ్వడం సరైందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేవలం వృద్దులకే కాకుండా అర్హత ఉన్న ఎక్కువ మందికి ఇవ్వడం వల్ల వ్యాక్సిన్‌ వృథాను అరికట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.


Next Story