తౌక్టే తుపాను దెబ్బకి అరేబియా సముద్రంలో కొట్టుకుపోయిన ఓఎన్జీసీ నౌక పీ305లో 14 మంది సిబ్బంది చనిపోయినట్టుగా గుర్తించారు. సముద్రంలో చిక్కుకున్నట్టుగా భావిస్తున్న మిగిలిన వారిని కాపాడేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. బాంబే హై ప్రాంతంలో పి-305 అనే భారీ నౌక లంగరు ఊడిపోయి సముద్రంలో కొట్టుకుపోయింది. సమాచారమందుకున్న నేవీ వెనువెంటనే యుద్ధనౌకలను రంగంలోకి దింపి సహాయకచర్యలు చేపట్టింది.
అయితే తీరానికి 35 నాటికల్ మైళ్ల దూరంలో ఈ నౌక నీటిలో మునిగిపోయి కన్పించింది. ప్రమాదం సమయంలో నౌకలో 261 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ నౌక నుంచి ఇప్పటివరకు 185 మందిని నౌకదళ సహాయకసిబ్బంది రక్షించి ఒడ్డుకు చేర్చగా.. నేడు 14 మంది మృతదేహాలను గుర్తించారు. మిగిలిన వారిని గుర్తించి, రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సముద్రంలో వాతావరణం మరీ ఇబ్బంది కరంగా ఉన్న నేపథ్యంలో సహాయక చర్యలు ఆలస్యమవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఐఎన్ఎస్ కోల్కతా, ఐఎన్ఎస్ బెత్వా, ఐఎన్ఎస్ కోచి, ఐఎన్ఎస్ తేజ్, ఐఎన్ఎప్ బియాస్ నౌకలతో పాటూ పీ9ఐ హెలికాప్టర్ కూడా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.