మా బాధ్యత ఇంకా ముగియలేదు: రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
జూన్ 2, శుక్రవారం ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ఘోర ట్రిపుల్ రైలు ప్రమాదం తర్వాత అదృశ్యమైన వారి కుటుంబ సభ్యులు
By అంజి Published on 5 Jun 2023 1:45 PM IST
మా బాధ్యత ఇంకా ముగియలేదు: రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
జూన్ 2, శుక్రవారం ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ఘోర ట్రిపుల్ రైలు ప్రమాదం తర్వాత అదృశ్యమైన వారి కుటుంబ సభ్యులు వీలైనంత త్వరగా వారిని కనుగొనేలా చేయడమే తమ లక్ష్యమని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం అన్నారు. "తప్పిపోయిన వ్యక్తుల కుటుంబ సభ్యులు వీలైనంత త్వరగా వారిని కనుగొనేలా చేయడమే మా లక్ష్యం... మా బాధ్యత ఇంకా ముగియలేదు" అని వైష్ణవ్ ఆదివారం రాత్రి విలేకరులతో అన్నారు.
బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదంలో 275 మంది చనిపోయారు. 1000 మందికి పైగా గాయపడ్డారు. ఈ భయంకరమైన ట్రిపుల్ రైలు ప్రమాదం జరిగిన 51 గంటల తర్వాత.. అప్, డౌన్ లైన్లలో దెబ్బతిన్న ట్రాక్ల మరమ్మతుల తర్వాత సేవలు పునఃప్రారంభించబడింది. ఆదివారం ఏఎన్ఐతో మాట్లాడిన రైల్వే మంత్రి.. ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు ఆదేశాలు పంపిన వెంటనే దెబ్బతిన్న ట్రాక్ల పునర్నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు.
“రైల్వే ట్రాక్ల పునరుద్ధరణపై ప్రధాని నరేంద్ర మోదీ తన సలహాలు, సూచనలు ఇచ్చారు. మొత్తం బృందం (పునరుద్ధరణ పనిలో నిమగ్నమై ఉంది) సేవల పునరుద్ధరణ కోసం దెబ్బతిన్న పట్టాలను సరిచేయడానికి శ్రద్ధగా, క్రమపద్ధతిలో శ్రమించింది”అని అతను చెప్పాడు. రైలు పట్టాలు తప్పిన సంఘటన జరిగిన 51 గంటల తర్వాత, సర్వీసులు పునఃప్రారంభం కావడానికి ముందు రెండు లైన్లను పునర్నిర్మించామని, పరీక్షించామని రైల్వే మంత్రి తెలిపారు.
"ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్లో మార్పు" కారణంగా ప్రమాదం జరిగిందని అంతకుముందు వైష్ణవ్ చెప్పారు. ట్రిపుల్ రైలు ప్రమాదంలో బెంగళూరు-హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, కోరమాండల్ ఎక్స్ప్రెస్, గూడ్స్ రైళ్లు దెబ్బతిన్నాయి. ఈ ఘటన బాలాసోర్ జిల్లాలోని బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో జరిగింది. కొన్ని మృతదేహాలను రెండుసార్లు లెక్కించినట్లు నిర్ధారించిన తర్వాత ఈ ఘోర ప్రమాదంలో మరణించిన వారి సంఖ్యను 288 నుండి 275కి సవరించినట్లు ఒడిశా చీఫ్ సెసీ ప్రదీప్ జెనా ఆదివారం స్పష్టం చేశారు.
దెబ్బతిన్న ట్రాక్ల పునరుద్ధరణ కోసం 1000 మందికి పైగా కార్మికులు సేవలందించబడ్డారు. 7 కంటే ఎక్కువ పొక్లెయిన్ మెషీన్లు, రెండు యాక్సిడెంట్ రిలీఫ్ రైళ్లు, 3-4 రైల్వే, రోడ్ క్రేన్లను కూడా ట్రాక్ పునరుద్ధరణ కోసం మోహరించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.