ఘోర రోడ్డుప్రమాదం, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు

ఒడిశాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక వ్యక్తి అతివేగంగా కారు నడపడం వల్ల రోడ్డు ప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla  Published on  27 Jan 2024 6:03 AM GMT
odisha, accident, three dead, car high speed,

 ఘోర రోడ్డుప్రమాదం, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు

ఒడిశాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక వ్యక్తి అతివేగంగా కారు నడపడం వల్ల రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ సంఘటన కోరాపూట్ జిల్లా బోరిగుమ్మ గ్రామం దగ్గర చోటు చేసుకుంది. శనివారం ఉదయం స్కార్పియో కారు వేగంగా దూసుకొచ్చింది. ముందు వెళ్తున్న ఆటోను ఓవర్‌ టేక్‌ చేయాలని ముందుకు వచ్చాడు. అయితే.. సింగిల్‌ రోడ్డు కావడంతో.. వాహనాలు ఓవర్‌ టేక్‌ చేసే టప్పుడు ఎదురుగా ఏ వాహనం రాకుండా చూసుకోవాలి. కానీ.. అక్కడ ఎదురుగా ఓ ట్రాక్టర్ వస్తోంది. అంతేకాక.. ఆ ట్రాక్టర్‌ను బైకర్‌ ఓవర్ టేక్ చేస్తున్నాడు. ఇదంతా చూసుకోని కారు డ్రైవర్‌ ఆటోను ఓవర్ టేక్‌ చేయబోయాడు. అంతే.. ముందుగా ఎదురుగా వచ్చిన బైకర్‌ను ఢీకొట్టింది కారు. ఆ తర్వాత అదుపుతప్పింది. ముందువెళ్తున్న ఆటోను వేగంగా ఢీకొట్టింది. ఇక ట్రాక్టర్ వెనకాలే వస్తోన్న మరో బైకర్‌ను కూడా ఢీకొట్టింది.

ఈ ఘోర ప్రమాద దృశ్యాలు అక్కడే ఉన్న ఒక చిన్న హోటల్‌ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా ఇతర వాహనదారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఇక మరో 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్తానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడ్డవారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేశామనీ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.


Next Story