మెట్రో రైలు పిల్లర్ కూలిన ఘటన.. నిర్మాణదారులకు నోటీసులు జారీ

Notices issued to constructors post Bangalore metro-rail pillar collapse. బెంగళూరులో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలిన ఘటనకు సంబంధించి

By అంజి  Published on  11 Jan 2023 9:00 AM GMT
మెట్రో రైలు పిల్లర్ కూలిన ఘటన.. నిర్మాణదారులకు నోటీసులు జారీ

బెంగళూరులో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలిన ఘటనకు సంబంధించి బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ సంబంధిత కాంట్రాక్టర్లు, ఇంజనీర్లకు నోటీసులు జారీ చేసిందని, దీనిపై అంతర్గత సాంకేతిక బృందం దర్యాప్తు చేస్తుందని తెలిపింది. నగరంలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్‌ కూలిపోవడంతో ఓ మహిళ తన పసిబిడ్డతో సహా మృతి చెందింది. ఈ ఘటనలో మహిళ భర్త, కుమార్తె గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. మృతుల కుటుంబానికి ఆసరా డబ్బులు అందజేస్తామని మెట్రో రైల్ కార్పొరేషన్‌ ప్రకటించింది.

"గాయపడిన వ్యక్తుల చికిత్స ఖర్చు,మృతుల కుటుంబానికి రూ. 20 లక్షలు అందించబడుతుంది" అని పేర్కొంది. బీఎంఆర్సీఎల్ బాధిత కుటుంబానికి అండగా నిలుస్తుందన్నారు. "ఒక మహిళ, పిల్లవాడు గాయపడ్డారు. వారిని వెంటనే చికిత్స కోసం ఆల్టియస్ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు వారి ప్రాణాలను రక్షించలేకపోయారు. ఈ దురదృష్టకర సంఘటన పట్ల బీఎంఆర్‌సీఎల్‌ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. బాధలో ఉన్న కుటుంబానికి అండగా నిలుస్తుంది'' అని కార్పొరేషన్‌ ప్రకటన పేర్కొంది.

ఈ ఘటనలో మృతి చెందిన మహిళ మామ విజయకుమార్‌ మాట్లాడుతూ.. నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ''మెట్రో పిల్లర్ నిర్మాణానికి బాధ్యత వహించిన కాంట్రాక్టర్ స్పష్టంగా భద్రతా చర్యలు తీసుకోలేదు. భద్రత లేకుండా నడుస్తున్నందున నిర్మాణ కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలి'' అని ఆయన అన్నారు. ''ప్రయాణీకులను తీసుకువెళుతున్న బస్సు లేదా మరేదైనా వాహనం ఆ పాయింట్‌ను దాటి ఉంటే, మరింత ప్రాణనష్టం జరిగి ఉండేది. నిర్మాణ స్థలాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను'' అని విజయకుమార్ తెలిపారు.

మరోవైపు బెంగళూరులోని నవగరాలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి ఇద్దరు మృతి చెందడంతో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సౌమ్యారెడ్డి డిమాండ్ చేశారు. ''కర్ణాటక ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. ఇది నాసిరకం పని అని స్పష్టంగా చెప్పవచ్చు మరియు ప్రజలు దానికి లొంగిపోయారు'' అని బెంగళూరులో మెట్రో పిల్లర్‌ కూలిపోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సౌమ్యారెడ్డి అన్నారు. ఇప్పటి వరకు గుంతల మరణాలు ఉండేవి.. ప్రస్తుతం స్తంభాలు కూలిపోతున్నాయి. ఇది బిజెపి ప్రభుత్వ ఉల్లంఘన, నిర్లక్ష్యం, అవినీతికి స్పష్టమైన సందర్భం అని సౌమ్యారెడ్డి అన్నారు.

Next Story