బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ (JD-U) అధినేత నితీష్ కుమార్ ఏప్రిల్ 10న రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన బీహార్ శాసనమండలి (MLC) సభ్యత్వానికి రాజీనామా చేశారు. నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తుండటంతో బీహార్లో కొత్త క్యాబినెట్ ఏర్పాటుపై కసరత్తు మొదలైంది. బీజేపీ కేంద్ర నాయకత్వం, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కలిసి త్వరలోనే కొత్త మంత్రివర్గంపై నిర్ణయం తీసుకుంటాయని బీజేపీ నేత సంజయ్ సరోగి వెల్లడించారు.
బీహార్ను అభివృద్ధి పథంలో నడిపించిన నితీష్ కుమార్, ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్లడం రాష్ట్రానికి లోటని జేడీయూ నేతలు పేర్కొంటున్నారు. తాను రాష్ట్రంలోని ఉభయ సభలతో పాటు పార్లమెంటులోనూ సభ్యుడిగా ఉండాలనే కోరికతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నితీష్ కుమార్ గతంలోనే తెలిపారు. ఆయన రాజ్యసభకు వెళ్లినప్పటికీ, బీహార్ రాజకీయాల్లో ఆయన పట్టు కొనసాగుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.