ఎవరు చేరినా, పొత్తు కుదిరినా.. ముఖ్యమంత్రి అభ్యర్థిని తానేనని తేల్చేసిన కమల్
MNM hopes to lead third front, Sarathkumar meets Kamal Haasan. తమిళనాడు రాజకీయాల విషయంలో మక్కళ్ నీది మయ్యం (ఎంఎన్ఎం)
By Medi Samrat Published on 28 Feb 2021 10:45 AM GMT
తమిళనాడు రాజకీయాల విషయంలో మక్కళ్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధినేత, నటుడు కమల్ హాసన్ పూర్తీ క్లారిటీతో దూసుకుని వెళ్తున్నాడు. ఎన్నికలకు నగారా మోగడంతో కమల్ హాసన్ తన పార్టీని ప్రజల్లోకి తీసుకుని వెళ్లే పనిలో పడ్డాడు. తన వెంట వచ్చే రాజకీయనాయకుల కోసం కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పటికే పొత్తుల విషయంలో తన పంథా తనదే అని నిరూపించుకున్న కమల్.. ముఖ్యమంత్రి అభ్యర్థిని మాత్రం తానేనని తెలిపాడు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి తరఫున తానే సీఎం అభ్యర్థినని స్పష్టం చేశారు. తమ సిద్ధాంతాలకు దగ్గరగా ఉండే పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. తమిళనాడులో తృతీయ కూటమి ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయని వెల్లడించారు. కమల్ ను నటుడు శరత్ కుమార్ కలిశారు. శరత్ కుమార్ కు చెందిన ఆలిండియా సమత్తువ మక్కల్ కట్చి (ఏఐఎస్ఎంకే) పార్టీ ఎంఎన్ఎంతో జట్టు కట్టే విషయమై చర్చలు జరిపారు.
ఇందియ జననాయగ కట్చి (ఐజేకే) పార్టీ ఉప కార్యదర్శి రవిబాబు కూడా కమల్ ను కలిసి పొత్తు విషయం మాట్లాడారు. తమిళనాడులో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తామని కమల్ హాసన్ వెల్లడించారు. మార్చి 1 నుంచి ఇంటర్వ్యూలు చేపడతామని వివరించారు. అభ్యర్థుల తొలి జాబితా మార్చి 7న విడుదల చేస్తామని చెప్పారు. మార్చి 3 నుంచి ఎంఎన్ఎం కూటమి ఎన్నికల ప్రచారం మొదలవుతుందని తెలిపారు.