అస్సాంలో ఎన్‌కౌంట‌ర్‌.. ఏడుగురు మిలిటెంట్లు మృతి

Militants killed in encounter with security personnel in Assam. అస్సాంలో జరిగిన ఎన్కౌంటర్ తో డిమాసా నేషనల్‌ లిబిరేషన్‌ ఆర్మీ కి కోలుకోలేని దెబ్బ తగిలిందన్నారు

By Medi Samrat  Published on  23 May 2021 10:56 AM GMT
encounter in Assam,

అస్సాంలో జరిగిన ఎన్కౌంటర్ తో డిమాసా నేషనల్‌ లిబిరేషన్‌ ఆర్మీ కి కోలుకోలేని దెబ్బ తగిలిందన్నారు సీఎం హిమంత బిశ్వ శర్మ. సంస్థకు చెందిన ఇద్దరు కీల‌క నేత‌లు సైతం ఎన్‌కౌంటర్‌లో గాయపడినట్లు ఆయన తెలిపారు. అస్సాంలోని కర్బీ -ఆంగ్లాంగ్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌కు సంబందించిన ఆదివారం మధ్యాహ్నం ఆయన వివరాలు వెల్లడించారు. కాల్పుల్లో ఏడుగురు మిలిటెంట్లను పోలీసులు మట్టుబెట్టారనీ, ఘటనాస్థలంలో 3 ఏకే- 47లు, భారీగా పేలుడు పదార్థాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయని ఆయన వెల్లడించారు.

కర్బీ -ఆంగ్లాంగ్‌ జిల్లాల సరిహద్దులో ఆ జిల్లా అదనపు ఎస్పీ ప్రకాశ్‌ సోనోవాల్‌ ఆధ్వర్యంలో భద్రతాదళాలు శనివారం రాత్రి నుంచి ఆపరేషన్‌ చేపట్టాయి. అస్సాం పోలీసులు, అస్సాం రైఫిల్స్‌ సంయుక్తంగా నిర్వహించిన ఈ కుంబింగ్ లో కొంతమంది వ్యక్తుల కదలికలు పోలీసులు గుర్తించారు. అస్సాంలోని కర్బీ -ఆంగ్లాంగ్ జిల్లాలతోపాటు నాగాలాండ్ సరిహద్దు జిల్లాల్లో డిమాసా నేషనల్‌ లిబిరేషన్‌ ఆర్మీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్న పోలీసులు ఆదివారం తెల్లవారు జామున తమపై దాడి చేసిన వారిపై ఎదురు దాడి చేశారు. ఘటనలో ఏడుగురు మరణించగా ఇద్దరు గాయపడ్డారు

ఘటనా స్థలంలో నాలుగు ఏకే 47 రైఫిల్స్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని భద్రతా అధికారులు చెప్పారు. డిమాసా నేషనల్ లిబరేషన్ ఆర్మీని 2019 లో ఉగ్రవాదులు స్థాపించారు. అస్సామ్ లో ఉండే అనేకానేక గిరిజనుల తెగలలో డిమాసా తెగ ఒకటి. ఈ తెగ లోని ప్రజల స్వాతంత్రం, హక్కుల సాధన కోసం డిమాసా నేషనల్ లిబరేషన్ ఆర్మీని ప్రారంభించామని డిఎన్ ఎల్ ఏ నేతలు చెబుతుంటారు.







Next Story