ఆ రాష్ట్రంలో 1వ తరగతి నుంచే బేసిక్ మిలిటరీ ట్రెయినింగ్

మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

By Knakam Karthik
Published on : 3 Jun 2025 12:46 PM IST

National News, Maharastra, Basic military training, Maharashtra Government, Military education

ఆ రాష్ట్రంలో 1వ తరగతి నుంచే బేసిక్ మిలిటరీ ట్రెయినింగ్

మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక 1వ తరగతి నుంచే విద్యార్థులకు బేసిక్​ మిలిటరీ శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే దేశభక్తి, క్రమశిక్షణ, వ్యాయామం వంటివి పెంపొందించడానికి ఈ మిలిటరీ శిక్షణను అందించనున్నట్లు ఆ రాష్ట్ర విద్యా మంత్రి దాదా భుసే తెలిపారు.

'1వ తరగతి నుంచి విద్యార్థులకు ప్రాథమిక స్థాయి సైనిక శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ శిక్షణతో దేశం పట్ల ప్రేమను పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. అలాగే క్రమశిక్షణ, క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయడం వంటి అలవాట్లను ప్రోత్సహిస్తుంది. దీనిద్వారా అత్యతసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలనే విషయంపై విద్యార్థులకు అవగాహన ఉంటుంది. ఇక విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం కోసం మాజీ సైనికులను నిమయమించనున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో మాజీ సైనికులు విద్యార్థులు శిక్షణ ఇస్తారు' దాదా భుసే తెలిపారు.

ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా సానుకూలంగా స్పందించారని విద్యాశాఖ మంత్రి దాదా భూసే వివరించారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి క్రీడా ఉపాధ్యాయులు, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ), స్కౌట్స్ అండ్ గైడ్స్‌తో పాటు సుమారు 2.5 లక్షల మంది రిటైర్డ్ సైనికుల సహాయ సహకారాలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.

ఏప్రిల్ 22న పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి, ఆ తర్వాత భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పరిణామాల నేపథ్యంలో ఈ సైనిక శిక్షణ ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు మంత్రి భూసే స్పష్టం చేశారు. కశ్మీర్‌లోని పహల్గామ్ బైసరన్ లోయలో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దారుణ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందని ఆరోపిస్తూ పాకిస్థాన్‌పై భారత ప్రభుత్వం దౌత్యపరమైన చర్యలు చేపట్టింది. ఇదే సమయంలో, భూకంపాలు, అగ్నిప్రమాదాలు, వరదలు, ఉగ్రదాడులు వంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రజలు, అధికారులు తమను తాము ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా 259 ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించారు.

Next Story