మహారాష్ట్రలో శివసేన, బీజేపీ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేంద్ర మంత్రి నారాయణ్ రాణేను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరేకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడంటూ నారాయణ్ రాణేపై మహారాష్ట్ర పోలీసులు కేసులు పెట్టారు. నాసిక్ లో బీజేపీ కార్యాలయంపై కొందరు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడికి పాల్పడింది శివసేన కార్యకర్తలు అని భావిస్తున్నారు. రాష్ట్రంలో పలు చోట్ల బీజేపీ, శివసేన కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. శివసేన యూత్ వింగ్ కార్యకర్తలు ముంబైలోని నారాయణ రాణే నివాసం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు.
ఈ క్రమంలో బీజేపీ, శివసేక కార్యకర్తల మధ్య వివాదం రాజుకుంది. ఒకరి మీద ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. కేంద్రమంత్రి నారాయణ్ రాణే మాట్లాడుతూ 'స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం ఏమిటో ముఖ్యమంత్రికి ఉద్ధవ్ థాకరేకి తెలియకపోవడం సిగ్గుచేటు.. ఆ సమయంలో నేను అక్కడుంటే చెంప చెళ్లుమనిపించేవాడ్ని' అని రాణే ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల కారణంగా రాణేపై నాసిక్, పూణేలో రెండు ఎఫ్ఐఆర్ లు, రాయ్ గఢ్ జిల్లా మహద్ ప్రాంతంలో మరో రెండు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. దీంతో రాణేను రత్నగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.