బంఫరాఫర్‌: స్మార్ట్‌ ఫోన్‌ కొంటే.. 2 కిలోల టమాటాలు

దేశవ్యాప్తంగా టమాటా ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌లో ఒక యువ వ్యాపారవేత్త ప్రత్యేకమైన ఆఫర్‌ను అందించారు

By అంజి  Published on  9 July 2023 2:09 AM GMT
Madhya Pradesh, 2 kg tomatoes free, smartphone purchas, Ashoknagar

బంఫరాఫర్‌: స్మార్ట్‌ ఫోన్‌ కొంటే.. 2 కిలోల టమాటాలు

టమాటా ధరలు అకాశనంటుతున్నాయి. వంటకాల్లో ఎక్కువగా వాడే టమాటాలను ఎవరు కొనలేని పరిస్థితి నెలకొంది. ఇప్పట్లో ధరలు తగ్గే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు ఓ యువకుడు. తన మొబైల్‌ షాపులో స్మార్ట్‌ ఫోన్‌ కొన్న వారికి రెండు కిలలో టమాటాలు గిఫ్ట్‌గా ఇస్తానని విచిత్రమైన ఆఫర్‌ని ప్రకటించాడు. మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌ సిటీలో అభిషేక్‌ అగర్వాల్‌ అనే యువకుడు మొబైల్‌ షాపు నడుపుతున్నాడు. కొన్ని రోజుల నుండి టమాటా ధరలు పెరగడాన్ని గమనించిన అభిషేక్‌కి ఓ ఆలోచన వచ్చింది. అనేకున్నదే తడవుగా.. దాన్ని ఆచరణలో పెట్టేశాడు.

తన షాపులో స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసిన వారికి రెండు కిలోల టమాటాలు బహుమతిగా ఇస్తానని వెల్లడించాడు. ఈ విషయం తెలుసుకున్న వినియోగదారులు ఆ దుకాణానికి వరుస కడుతున్నారు. ఈ ఆఫర్‌ వల్ల కస్టమర్ల సంఖ్య పెరిగిందని.. స్మార్ట్‌ఫోన్లు కూడా ఎక్కువగా అమ్ముడయ్యాయని అశోక్‌ సంతోషం వ్యక్తం చేశాడు. కిలోకు రూ. 160-180 ధర ఉన్న టమోటాలతో ఈ స్కీమ్‌ వినియోగదారుల దృష్టిని ఆకర్షించిందని, ఇది మొబైల్ అమ్మకాలను పెంచింది. వినియోగదారులు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా టమోటాలను పొందే అవకాశంతో సంతోషంగా ఉన్నారు. అభిషేక్ మొబైల్‌ షాప్‌ నుండి వచ్చిన ఈ ఆఫర్ ఈ ప్రాంతంలో విపరీతమైన ప్రజాదరణ పొందింది.

Next Story