లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన ఉదారతను చాటుకున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దు ఏరియాల్లో ఉద్రిక్తతల కారణంగా అనాథలైన చిన్నారుల బాధ్యతను తీసుకునేందుకు రాహుల్ ముందుకొచ్చారు. తల్లిదండ్రులు, కుటుంబాలను కోల్పోయిన పూంఛ్ జిల్లాకు చెందిన 22 మంది చిన్నారులను రాహుల్ దత్తత తీసుకోనున్నట్లు జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ హమీద్ వెల్లడించారు.
ఈ నేపథ్యంలో, జమ్ము కశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ హమీద్ 22 మంది చిన్నారులతో కూడిన జాబితాను రూపొందించి రాహుల్ గాంధీకి అందజేశారు. ఇక ఆ చిన్నారుల బాధ్యతను రాహుల్ గాంధీయే చూసుకుంటారని, వారికి గ్రాడ్యుయేషన్ వరకు విద్య, వైద్యం, ఇతర ఖర్చులన్నీ రాహుల్ భరిస్తారని హమీద్ వివరించారు. త్వరలోనే ఈ చిన్నారులకు తొలి విడత సాయం అందజేస్తామని చెప్పారు.