కన్నడ రచయితలకు బెదిరింపు లేఖలు.. హిందూ కార్యకర్త అరెస్ట్

కర్ణాటకలోని దావణగెరె జిల్లాకు చెందిన శివాజీ రావ్ జాదవ్ అనే హిందూ కార్యకర్తను అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.

By అంజి
Published on : 30 Sept 2023 1:02 PM IST

Karnataka, Hindu activist, threat letters, Kannada authors

కన్నడ రచయితలకు బెదిరింపు లేఖలు.. హిందూ కార్యకర్త అరెస్ట్ 

కర్ణాటకలోని దావణగెరె జిల్లాకు చెందిన శివాజీ రావ్ జాదవ్ అనే హిందూ కార్యకర్త 15 మందికి పైగా అభ్యుదయ కన్నడ రచయితలు, ఆలోచనాపరులకు బెదిరింపు లేఖలు పంపినందుకు అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. సిటీ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు జాదవ్‌ను జిల్లాలో అరెస్టు చేశారు. నిందితుడు గత రెండేళ్లుగా బెదిరింపు లేఖలు రాస్తున్నారని, దీనితో త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరుతూ లక్ష్యంగా చేసుకున్న రచయితలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను పలుమార్లు కలిశారు. హిందుత్వానికి విరుద్ధం అంటూ కె.వీరభద్రప్ప, బిఎల్ వేణు, బంజగెరె జయప్రకాష్, బిటి లలితా నాయక్, వసుంధర భూపతి సహా బాధితులను జాదవ్ ఆ లేఖల్లో బెదిరించారు.

కేసును స్పెషల్ వింగ్ సీసీబీకి అప్పగించారు. ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (FSL) నిపుణులు అన్ని లేఖలు ఒకే వ్యక్తి రాసినవి కానీ వివిధ జిల్లాలు, తాలూకాల నుండి పోస్ట్ చేయబడినవి అని కనుగొన్నారు. లేఖలు రావడంతో రాష్ట్ర హోంమంత్రి డా.జి.పరమేశ్వర రచయితలకు తగిన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించారు. జాదవ్ తన నేరాన్ని అంగీకరిస్తూనే, హిందూ వ్యతిరేక వైఖరి కారణంగా రచయితలు, ఆలోచనాపరులను బెదిరించినట్లు పేర్కొన్నాడు. పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరిచి విచారణ నిమిత్తం 10 రోజుల కస్టడీకి తీసుకున్నారు.

Next Story