కర్ణాటకలో సీఎం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ వేతనాలకు రెక్కలు

Karnataka assembly passes bills to hike salaries of CM and legislators. కర్ణాటకలో సీఎం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ వేతనాలకు రెక్కలు వచ్చాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యుల జీతాలు,

By అంజి  Published on  23 Feb 2022 2:15 PM GMT
కర్ణాటకలో సీఎం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ వేతనాలకు రెక్కలు

కర్ణాటకలో సీఎం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ వేతనాలకు రెక్కలు వచ్చాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యుల జీతాలు, భత్యాలను పెంచే బిల్లులను కర్ణాటక శాసనసభ మంగళవారం ఆమోదించింది. కర్ణాటక రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే మంత్రుల వేతన భత్యాలను, పెన్షన్లను బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మంగళవారం విధానసభలో ఈ మేరకు రెండు బిల్లులను ఆమోదించారు. ఇప్పుడున్న జీతాలతో పోలిస్తే 50 శాతం పెరగనున్నాయి. సభ రెండు బిల్లులను ఆమోదించింది కర్ణాటక మంత్రుల జీతాలు, అలవెన్సులు (సవరణ) బిల్లు, 2022 , కర్ణాటక శాసనసభ జీతాలు, పెన్షన్లు మరియు అలవెన్సులు (సవరణ) బిల్లు, 2022 ను ఎటువంటి చర్చ లేకుండా అమలు చేసింది.

2015 తరువాత జీతభత్యాలను పెంచలేదని.. ఇప్పుడు పెంచారని సభ్యులు తెలిపారు. కొత్తగా ముఖ్యమంత్రి వేతనంలో రూ.50– 75 వేల వరకు పెరుగుతుంది. మంత్రుల జీతంలో రూ.40–60 వేల మధ్య పెరుగుతుంది. వారి వార్షిక అలవెన్స్‌లు రూ.లక్ష పెరిగి రూ.4.5 లక్షలకు చేరనున్నాయి. మంత్రుల నెలవారి ఇంటి అద్దె రూ.80 వేలు ఉండగా దానిని రూ.1.25 లక్షలకు పెంచారు. ఇంటి ముందు తోట నిర్వహణ భత్యం రూ.30 వేలకు పెంచారు. నెలకు వెయ్యి లీటర్లకు ఉన్న పెట్రోల్‌/ డీజిల్‌ వ్యయం ఇప్పుడు 2 వేల లీటర్లకు పెంచారు.

మంత్రుల రోజువారి టూర్‌ అలవెన్స్‌ రూ.2,500కు పెంచడం విశేషం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విషయానికి వస్తే వారి వేతనంలో రూ.25– 40 వేల పెరుగుదల ఉంటుంది. నెలవారి నియోజకవర్గ భత్యం రూ. 60 వేలుగా చెప్పారు.. మాజీలకు నెలకు రూ.50 వేల పెన్షన్‌ లభిస్తుంది. బిల్లులు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, జీవన వ్యయం గణనీయంగా పెరగడాన్ని కారణాలుగా పేర్కొంటూ ప్రభుత్వం బిల్లులను ఆమోదించింది. ఈ పెంపుదల వల్ల సంవత్సరానికి సుమారు ₹ 92.4 కోట్ల అదనపు వ్యయం అవుతుంది.

Next Story