క్రమశిక్షణ నేర్పించాల్సిన ఆ ఉపాధ్యాయుడు విచక్షణ కోల్పోయాడు. 11 ఏళ్ల విద్యార్థి రెండో ఎక్కం చెప్పలేదని ఏకంగా డ్రిల్లింగ్ మెషీన్తో గాయపరిచాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కాన్పూర్లోని ప్రేమ్నగర్లో గల అప్పర్ ప్రైమరీ స్కూల్లో 11 ఏళ్ల విద్యార్థి వివాన్ ఐదో తరగతి చదువుతున్నారు. వివాన్ రోజూ లాగే పాఠశాలకు వెళ్లాడు. అయితే మొన్న ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఐబీటీ ఇన్స్టిట్యూట్కు చెందిన టీచర్.. నైపుణ్య శిక్షణ కార్యక్రమం కింద ఐదో తరగతి విద్యార్థులకు క్లాస్ తీసుకున్నాడు.
ఈ క్రమంలోనే విద్యార్థులను ఎక్కాలు చెప్పమన్నాడు. ఎక్కాలు సరిగా చెప్పకపోవడంతో టీచర్ డ్రిల్ మెషీన్తో విద్యార్థిని గాయపర్చాడు. విద్యార్థి చేతికి గాయం ఉండడంతో తల్లిదండ్రులు శుక్రవారం పాఠశాలకు వచ్చి ఆందోళన చేశారు. విద్యార్థి వివాన్ మాట్లాడుతూ.. అనూజ్ అనే టీచర్ డ్రిల్ మెషీన్ను తీసుకుని తమ తరగతికి వచ్చారని చెప్పారు. అతను దానిని ఆన్ చేసి ఎక్కాలు చదవడంలో విఫలమైనప్పుడు చేతికి తాకించాడని చెప్పాడు. అప్పుడు పక్కనే నిలబడిన కృష్ణ అనే విద్యార్థి డ్రిల్ మిషన్ ప్లగ్ ను తొలగించాడు. విద్యార్థి ఎడమ చేతికి గాయాలు, గాయాలయ్యాయి.
విద్యార్థికి గాయాలు కావడంతో ప్రథమ చికిత్స అందించి పాఠశాల నుంచి పంపించారు. టీచర్ అల్కా త్రిపాఠి ఈ విషయాన్ని ఏ ఉన్నతాధికారులకు చెప్పలేదు. శుక్రవారం ఈ విషయమై ఒక్కసారిగా కలకలం రేగడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే బీఎస్ఏ సూర్జిత్కుమార్ సింగ్ ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. టీచర్ను స్కూల్ నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. దీనితో పాటు ఇతర చర్యలు కూడా తీసుకోనున్నారు. ''ఈ విషయం మా దృష్టికి వచ్చింది. దర్యాప్తుకు ఆదేశించబడింది. దాన్ని పరిశీలించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం'' అని కాన్పూర్ బీఎస్ఏ సుర్జీత్ కుమార్ తెలిపారు.