జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. అమరులైన నలుగురు జవాన్లు.. ఉగ్రవాది హతం

జమ్మూ కాశ్మీర్‌లోని సరిహద్దు జిల్లా రాజౌరీలోని కలకోట్ తహసీల్‌లోని ధర్మసల్ గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఆర్మీ సిబ్బంది, ఒక ఉగ్రవాది మరణించారు.

By అంజి  Published on  23 Nov 2023 1:13 AM GMT
Jammu and Kashmir , Rajouri, encounter, National news

జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. అమరులైన నలుగురు జవాన్లు.. ఉగ్రవాది హతం

నవంబర్ 22 బుధవారం జమ్మూ కాశ్మీర్‌లోని సరిహద్దు జిల్లా రాజౌరీలోని కలకోట్ తహసీల్‌లోని ధర్మసల్ గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఆర్మీ సిబ్బంది, ఒక ఉగ్రవాది మరణించారు. మరో ఇద్దరు ఆర్మీ సిబ్బందికి గాయాలయ్యాయి. జమ్ము కశ్మీర్ పోలీసు, భారత సైన్యం - తీవ్రవాదుల సంయుక్త దళాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. కొన్ని రోజుల క్రితం ప్రారంభించిన ఈ ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లో భాగమైన సెర్చ్ పార్టీపై ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

ఘటనా స్థలంలో చిక్కుకున్న ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు మరిన్ని బలగాలను రంగంలోకి దించడంతో ఆ ప్రాంతంలో భీకర కాల్పులు కొనసాగుతున్నాయని వారు తెలిపారు. శుక్రవారం, నవంబర్ 17, రాజౌరి జిల్లాలోని బుధాల్ ప్రాంతంలో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అతని వద్ద నుంచి ఒక ఏకే-47 రైఫిల్, మూడు మ్యాగజైన్లు, మూడు గ్రెనేడ్లు, ఒక పర్సు స్వాధీనం చేసుకున్నారు.

అదనపు బలగాల మోహరింపుతో ఆపరేషన్‌ ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల ఆచూకీ కోసం ఆదివారం నుంచి ఆ ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని స్థానికులు తెలిపారు. “ఆపరేషన్ కారణంగా, బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండమని మమ్మల్ని అడిగారు. మా పిల్లలు పాఠశాలకు హాజరుకాకుండా ఇంట్లోనే ఉన్నారు, ”అని గ్రామస్థుడు మీడియాకు తెలిపారు.

గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయని తెలిపారు. బాజిమాల్‌లోని ఎన్‌కౌంటర్ స్థలంలో చిక్కుకున్న ఇద్దరు సాయుధ వ్యక్తులు విదేశీ పౌరులుగా కనిపించారని, ఆదివారం నుంచి ఆ ప్రాంతంలో తిరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. వారు ప్రార్థనా స్థలంలో కూడా ఆశ్రయం పొందారని వారు చెప్పారు.

సరిహద్దు జిల్లాలైన రాజౌరీ, పూంచ్‌లలో గత ఏడాదిన్నర కాలంగా తీవ్రవాద సంఘటనలు పెరిగాయి. నవంబర్ 17న రాజౌరి జిల్లాలోని గుల్లర్ బెహ్రోట్ ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఆగస్టు 7న పూంచ్ జిల్లాలోని దేగ్వార్ ప్రాంతంలో సరిహద్దు దాటి చొరబాటు ప్రయత్నాన్ని సైన్యం భగ్నం చేయడంతో మరో ఉగ్రవాది హతమయ్యాడు. మే 5న రాజౌరి జిల్లాలోని కేసరి కొండల్లో జరిగిన యాంటీ టెర్రర్ ఆపరేషన్‌లో ఐదుగురు ఆర్మీ జవాన్లు మరణించారు.

Next Story