ప్రపంచవ్యాప్తంగా డెంగ్యూ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో భారతదేశం ఒక చారిత్రాత్మక విజయానికి చేరువలో ఉంది. భారతీయ సంస్థ పానాసియా బయోటెక్ అభివృద్ధి చేసిన 'డెంగీఆల్' (DengiAll) వ్యాక్సిన్ ప్రస్తుతం చివరి దశ (ఫేజ్-3) క్లినికల్ ట్రయల్స్లో ఉంది. ప్రపంచంలోనే మొట్టమొదటి "సింగిల్ డోస్" డెంగ్యూ వ్యాక్సిన్లలో ఒకటిగా ఇది గుర్తింపు పొందనుంది. ప్రస్తుతం ఐసీఎంఆర్ పర్యవేక్షణలో దేశవ్యాప్తంగా 10,000 మంది వాలంటీర్లపై ఈ పరీక్షలు జరుగుతున్నాయి.
ఒకవేళ ఈ ట్రయల్స్ విజయవంతమైతే, వచ్చే ఏడాది నాటికే ఈ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. డెంగ్యూలోని నాలుగు రకాల వైరస్ స్ట్రెయిన్స్పై ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని, ఒకటి నుంచి 60 ఏళ్ల వయస్సు వారు దీనిని తీసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. వాతావరణ మార్పుల వల్ల డెంగ్యూ ముప్పు పెరుగుతున్న వేళ, తక్కువ ధరకే లభించే ఈ స్వదేశీ వ్యాక్సిన్ భారత్తో పాటు ఇతర పేద దేశాలకు పెద్ద ఊరటనివ్వనుంది.