ఇండియా పేరు భారత్‌గా మారుస్తారా? పార్లమెంట్‌లో తీర్మానం..!?

ఇండియా పేరుని భారత్‌గా మార్చేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

By Srikanth Gundamalla  Published on  5 Sep 2023 8:54 AM GMT
india,  bharat, presedent, invitation,

ఇండియా పేరు భారత్‌గా మారుస్తారా? పార్లమెంట్‌లో తీర్మానం..!?

ఇండియా పేరుని భారత్‌గా మార్చేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఢిల్లీ వేదికగా జరగనున్న జీ20 సదస్సు నేపథ్యంలో రాష్ట్రపతి భవన్‌ పంపిన డిన్నర్‌ ఇన్విటేషన్‌లోలో కూడా మార్పులు కనిపించాయి. ప్రెసిడెంట్ ఆఫ్ భారత్‌గా పేర్కొనడాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా బట్టబయలు చేశారు. అంతేకాదు.. ఆర్ఎస్ఎస్ చీఫ్‌ మోహన్ భగవత్ భారత అనే పదాన్ని అందరికీ అలవాటు చేయాలని పిలుపునిచ్చిన విషయం కూడా తెలిసిందే. వరుసగా ఈ పరిణామాల మధ్య ఇండియా పేరును భారత్‌గా మార్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

సెప్టెంబర్‌ 9 నుంచి రెండ్రోజుల పాటు ఢిల్లీ వేదికగా జీ20 సదస్సు జరగనుంది. ఈ సదస్సు సందర్భంగా సెప్టెంబర్ 9న జరగనున్న డిన్నర్ భేటీకి రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వానంలో ప్రెసిడెంట్‌ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్‌ ఆఫ్ భారత్‌ అని పేర్కొన్నారని జైరాం రమేశ్ తెలిపారు. ఈ మేరకు విడుదలైన కాపీని ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇక నుంచి రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ప్రకారం మన దేశం పేరును భారత్ గా పిలవాల్సి ఉంటుందన్నారు. ఒక వేళ ఇండియా పేరును భారత్‌గా మార్చినా కూడా.. సమాఖ్య వ్యవస్థపై దాడి కొనసాగుతూను ఉంటుందని జైరాం రమేశ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. చరిత్రను వక్రీకరించడం, భారతదేశాన్ని విభజించడాన్ని మోదీ కొనసాగిస్తున్నారని విమర్శించారు.

జైరాం రమేశ్‌ పోస్టుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. భారత్‌ పేరును కాంగ్రెస్‌ అనవసరంగా వివాదాస్పదం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ గౌరవం, ప్రతిష్టకు సంబంధించిన ప్రతి విషయంలోనూ కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తోందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు దేశంపైనా, దేశ రాజ్యాంగంపైనా, రాజ్యాంగ సంస్థలపైనా గౌరవం లేదని జేపీ నడ్డా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న దేశ, రాజ్యాంగ వ్యతిరేక విధానాల గురించి యావత్ దేశానికి తెలుసని జేపీ నడ్డా పేర్కొన్నారు.

Next Story