'మహనీయుల కలలను సాకారం చేయాలి'.. ఎర్రకోటపై జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ
78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండా ఆవిష్కరించారు.
By అంజి Published on 15 Aug 2024 8:05 AM IST
'మహనీయుల కలలను సాకారం చేయాలి'.. ఎర్రకోటపై జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ
78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఆ సమయంలో భారత ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ఖడ్, కేంద్రమంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2047 వికసిత్ భారత్ థీమ్తో ఈ సారి పంద్రాగస్టు వేడుకలు జరుగుతున్నాయి.
భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రాణాలర్పించిన సమరయోధులకు దేశం రుణపడి ఉందన్నారు. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. వాళ్లందరిని సర్మించుకునే రోజు ఇదేనన్నారు.
శతబ్దాల తరబడి దేశం బానిసత్వంలో మగ్గిందన్నారు. 40 కోట్ల మంది కలిసి స్వాతంత్య్రాన్ని సాధిస్తే.. 140 కోట్ల మంది ఏదైనా సాధించవచ్చని ప్రధాని మోదీ అన్నారు. భారత్ ప్రస్థానాం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని అన్నారు. సమరయోధుల కలలను సాకారం చేయాలని, లక్ష్యాన్ని నిర్దేశిచుకుని ముందుకు సాగాలని ప్రధాని మోదీ సూచించారు.
ఇటీవలి ప్రకృతి వైపరీత్యాల కారణంగా దేశం ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. అతను ప్రకృతి వైపరీత్యాలకు ప్రభావితమైన వారికి తన హృదయపూర్వక సానుభూతిని తెలియజేశారు. ఈ సంవత్సరం, గత కొన్ని సంవత్సరాలుగా ప్రకృతి వైపరీత్యం కారణంగా ఆందోళనలు పెరుగుతూనే ఉన్నాయని అన్నారు. అనేక మంది ప్రజలు తమ కుటుంబ సభ్యులను, ఆస్తిని ప్రకృతి వైపరీత్యంలో కోల్పోయారు, దేశం కూడా నష్టపోయిందన్నారు.
"ఈ రోజు, నేను వారందరికీ నా సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ సంక్షోభ సమయంలో ఈ దేశం వారికి అండగా ఉంటుందని నేను వారికి హామీ ఇస్తున్నాను" అని పేర్కొంటూ, దేశానికి తన మద్దతు ఉంటుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.