రాజస్థాన్లోని చురు జిల్లాలోని భానుడా గ్రామం సమీపంలో బుధవారం జాగ్వార్ ఫైటర్ జెట్ కూలిపోవడంతో భారత వైమానిక దళం (IAF) పైలట్తో సహా ఇద్దరు వ్యక్తులు మరణించారని అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. పైలట్ మృతదేహంతో పాటు, విమానం శిథిలాలు ఒక పొలంలో కనిపించాయి. తీవ్రంగా దెబ్బతిన్న స్థితిలో మృతదేహాన్ని వెలికితీశారు. ప్రమాదంలో మరణించిన పైలట్, మరొక వ్యక్తి గుర్తింపులను సైన్యం, లోకల్ అడ్మినిస్ట్రేట్ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ఫైటర్ జెట్ శిక్షణలో ఉండగా ఈ ప్రమాదం జరిగిందని జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి.
వైమానిక దళం రాజస్థాన్లో బహుళ స్థావరాలను నిర్వహిస్తోంది, జోధ్పూర్, బికనీర్లలో ప్రధాన స్థావరాలు ఉన్నాయి. ఈ సంఘటన జరిగిన వెంటనే, ఆ ప్రాంతంలో భయాందోళనలు వ్యాపించాయి. ఆకాశం నుండి పెద్ద శబ్దం వినిపించిందని, ఆ తర్వాత పొలాల నుండి మంటలు, పొగలు ఎగసి వచ్చాయని గ్రామస్తులు తెలిపారు. ప్రమాదం కారణంగా సమీపంలోని పొలాల్లో మంటలు చెలరేగాయని, దానిని తాము ఆర్పేందుకు ప్రయత్నించామని స్థానికులు తెలిపారు. జిల్లా కలెక్టర్ అభిషేక్ సురానా, పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
ఆ ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచడానికి, దర్యాప్తు ప్రారంభించడానికి ఆర్మీ రెస్క్యూ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుంటుందని భావిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు. ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత సైన్యం అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 1.25 గంటల ప్రాంతంలో భనోడా గ్రామంలోని వ్యవసాయ పొలంలో విమానం కూలిపోయిందని స్థానిక పోలీసు అధికారి రాజల్దేశర్ కమ్లేష్ వార్తా సంస్థ పిటిఐకి తెలిపారు. ప్రమాద స్థలానికి సమీపంలో మానవ శరీర భాగాలు లభించాయని ఆయన అన్నారు.