దేశ రాజధాని ఢిల్లీలో హెచ్ఐవీ రోగులు ధర్నాకు దిగారు. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఎదుట రోగులు బైఠాయించారు. యాంటీరెట్రోవైరల్ ఔషధాల కొరతకు వ్యతిరేకంగా హెచ్ఐవీ రోగుల బృందం నిరసన తెలుపుతోంది. ఢిల్లీతో పాటు రాష్ట్రాల్లోని ప్రముఖ పట్టణాల్లో మెడిసన్ లభించడం లేదని హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులు అంటున్నారు. ప్రభుత్వానికి ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా.. ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. మెడిసన్స్ స్టాక్లో లేవని చెబుతున్నారని, ఒకవేళ మందులు లేకుంటే, అప్పుడు దేశాన్ని హెచ్ఐవీ రహిత దేశంగా ఎలా చేస్తారని ఓ రోగి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
''హెచ్ఐవీ రోగులకు అవసరమైన, కీలకమైన ప్రాణాలను రక్షించే మందులు గత 5 నెలలుగా ఢిల్లీ, పొరుగు రాష్ట్రాల్లో అందుబాటులో లేకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తున్నాం. మేం ఎన్నిసార్లు రాష్ట్ర అధికారులకు లేఖలు రాసినా ఫలితం లేకుండా పోయింది.'' అని ఓ రోగి తెలిపాడు.
యాంటీరెట్రోవైరల్ ఔషధాల కొరతపై నిరసనల మధ్య.. జాతీయంగా తగినంత స్టాక్ ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. మందులు వెంటనే సమీపంలోని కేంద్రాల నుండి తరలించబడతాయని తెలిపారు. మరోవైపు నిరసనకారులకు చెందిన నలుగురు ప్రతినిధులు సోమవారం నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సీనియర్ అధికారులతో చర్చించారు.