హరియాణాలో బిజేపి ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్.. అవిశ్వాస తీర్మానాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టింది. ఇటీవల ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు అధికార పార్టీకీ మద్దతు ఉపసంహరించడం వల్ల బిజేపి మెజార్టీ పడిపోయిందని కాంగ్రెస్ వాదిస్తోంది. ఈ మేరకు ఆ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ జ్ఞాన్చంద్ గుప్తా ఆమోదించారు.
ఈ నేపథ్యంలో బుధవారం జరగనున్న బలపరీక్షకు భాజపా సహా కాంగ్రెస్ తమ సభ్యులకు విప్ జారీ చేశారు. తప్పనిసరిగా సభకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా సభ నుంచి బయటకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశాయి.
హరియాణాలో మొత్తం అసెంబ్లీలో 90 స్థానాలకు గాను.. ప్రస్తుతం 88 మంది సభ్యులు ఉన్నారు. అధికార భాజపా(40) -జేజేపీ(10) కూటమికి 50 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్కు 30 మంది సభ్యులు ఉన్నారు. మరో ఏడుగురు స్వతంత్రులు కాగా.. వారిలో ఐదుగురు ప్రభుత్వానికి మద్దతునిస్తున్నారు. హరియాణా లోఖిత్ పార్టీకీ చెందిన మరో ఎమ్మెల్యే కూడా ప్రభుత్వానికి మద్దతునిస్తున్నారు.