అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ డీఎన్ఏ సరిపోలడంతో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. దీంతో ఆయన భౌతికకాయాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు అధికారులు. సమాచారం ప్రకారం ఆయన అంత్యక్రియలు రాజ్కోట్లో జరగనున్నాయి. గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ మాట్లాడుతూ.. ఈరోజు ఉదయం 11:10 గంటలకు విజయ్ రూపానీ DNA మ్యాచ్ జరిగింది. ఆయన భౌతికకాయాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారని తెలిపారు.
జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది మరణించారు. విజయ్ రూపానీ తన భార్య, కూతురిని కలిసేందుకు లండన్ బయలుదేరారు. కానీ అనుకోకుండా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 32 మృతదేహాలను DNA పరీక్ష ద్వారా గుర్తించామని అధికారులు తెలిపారు. వారిలో 14 మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు.