భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) చరిత్ర సృష్టించింది. షార్ ప్రయోగించిన వందో ప్రయోగం విజయవంతం అయ్యింది. ఇవాళ ఉదయం 6.23 గంటలకు నిప్పులు చిమ్ముకుంటూ జీఎస్ఎల్వీ - ఎఫ్15 ఆకాశంలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోట నుంచి ప్రయోగించిన 19 నిమిషాల తర్వాతఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీంతో షార్ శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2,250 కిలోల బరువు ఉన్న ఈ శాటిలైట్ను యూఆర్ శాటిలైట్ సెంటర్ డిజైన్ చేసింది.
ఇది పదేళ్ల పాటు భౌగోళిక, వైమానిక, సముద్ర నేవిగేషన్ సేవలు అందించనుంది. షార్ నుంచి చేపట్టిన వందో ప్రయోగం మైలు రాయిగా నిలుస్తుందని ఇస్రో చైర్మన్ డా.వి.నారాయణన్ అన్నారు. ఈ ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం సక్సెస్ కావడం సంతోషంగా ఉందన్నారు. దీని కోసం పని చేసిన సైంటిస్టులు, సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. విక్రమ్ సారా భాయ్ నుంచి ఇస్రో విజయ పరంపర కొనసాగుతోందని చెప్పారు. ఇప్పటి వరకు ఆరు జనరేషన్ల లాంచ్ వెహికల్స్ అభివృద్ధి చేసినట్టు ఆయన వివరించారు.