మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్కు అస్వస్థత
మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, ఛాతిలో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆమె.. నిన్న రాత్రి మహారాష్ట్రలోని పుణేలో గల భారతి ఆస్పత్రిలో చేరారు.
By అంజి
మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్కు అస్వస్థత
మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, ఛాతిలో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆమె.. నిన్న రాత్రి మహారాష్ట్రలోని పుణేలో గల భారతి ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు. ఆమె 2007 నుండి 2012 వరకు భారత రాష్ట్రపతిగా బాధ్యతలను నిర్వర్తించిన సంగతి తెలిసిందే. ప్రతిభా పాటిల్ వయసు 89 సంవత్సరాలు.
"మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గత రాత్రి ఆసుపత్రిలో చేరారు. ఆమెకు జ్వరంతో పాటు ఛాతీలో కొంత ఇన్ఫెక్షన్ ఉంది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆమె చికిత్సలో ఉంది. నిశితంగా పరిశీలిస్తున్నారు" అని ఆసుపత్రికి చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గత ఏడాది ఫిబ్రవరిలో మాజీ రాష్ట్రపతి పాటిల్ భర్త దేవిసింగ్ షెకావత్ 89 ఏళ్ల వయసులో గుండెపోటుతో కన్నుమూశారు.
2007 నుంచి 2012 వరకు భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి మహిళగా పాటిల్ చరిత్ర సృష్టించారు. 1962లో, పాటిల్ మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలోని జల్గావ్ నగర నియోజకవర్గం నుండి మొదటిసారిగా కాంగ్రెస్ శాసనసభ సభ్యురాలిగా ఎన్నిక అయ్యారు. అంతకుముందు చలీస్గావ్లో జరిగిన క్షత్రియ మహాసభ సమావేశంలో ఆమె ప్రసంగం చేసిన తర్వాత, అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి వై.బి.చవాన్ ఆమెకు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ టిక్కెట్టు ఇచ్చారు.
అప్పటి నుండి, ఆమె 1985 వరకు ఎడ్లాబాద్ (ముక్తాయ్ నగర్) నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత, ఆమె 1985 నుండి 1990 వరకు రాజ్యసభలో పార్లమెంటు సభ్యురాలుగా పనిచేశారు. 1991 సార్వత్రిక ఎన్నికలలో అమరావతి నియోజకవర్గం నుండి 10వ లోక్సభకు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఇప్పటివరకు పోటీ చేసిన ఒక్క ఎన్నికల్లో కూడా ఓడిపోని ప్రత్యేకతను ఆమె సొంతం చేసుకున్నారు.
కళాశాలలో ఉన్నప్పుడు, ఆమె క్రీడలలో చురుకుగా పాల్గొనేది, టేబుల్ టెన్నిస్లో రాణించింది. వివిధ ఇంటర్-కాలేజియేట్ టోర్నమెంట్లలో అనేక షీల్డ్లను గెలుచుకుంది. ఎమ్మెల్యేగా కూడా ఆమె ముంబైలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో న్యాయ విద్యార్థినిగా చదువుకున్నారు.