ఆపరేషన్ సింధూర్పై విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, రక్షణ శాఖ అధికారులు కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కీలక ప్రకటన చేశారు. భారత్ సరిహద్దుల వద్ద పాకిస్తాన్ రెచ్చగొడుతూ దాడులు చేస్తుందన్నారు. భారత్లోని పలు వైమానిక స్థావరాలపై పాక్ దాడులు చేస్తున్నట్టు వివరించారు. భారత్ కూడా పాక్ సైన్యానికి గట్టి జవాబు ఇస్తున్నట్టు తెలిపారు. భారత్లో భారీ నష్టం చేశామంటూ పాకిస్థాన్ తప్పుడు ప్రచారం చేసుకుంటోందని విక్రమ్ మిస్రీ తెలిపారు. S-400 రక్షణ వ్యవస్థను నాశనం చేశామని, ఆర్మీ బేస్లను దెబ్బతీశామంటూ చేస్తున్న ప్రచారం అంతా అబద్ధమని స్పష్టం చేశారు. భారత్ అమృత్సర్ గోల్డెన్ టెంపుల్పై దాడి చేసిందంటూ పాకిస్తాన్ మతాల మధ్య చిచ్చుకు యత్నిస్తోందని పేర్కొన్నారు.
భారత్ పశ్చిమ ప్రాంతాలపై పాకిస్తాన్ నిరంతర దాడులు చేస్తోందని కల్నల్ సోఫియా ఖురేషి వెల్లడించారు. మిస్సైల్స్, డ్రోన్లు, ఇతర ఆయుధాలతో అటాక్ చేస్తోందని పేర్కొన్నారు. శ్రీనగర్, ఉదంపూర్, అవంతిపొర ఎయిర్ బేస్లను హైస్పీడ్ మిస్సైల్తో ధ్వంసం చేసేందుకు పాక్ ప్రయత్నించిందని చెప్పారు. వాటిని భారత్ సమర్థంగా తిప్పికొట్టిందని స్పష్టం చేశారు. పాక్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేసిన విషయాన్ని భారత్ ధ్రువీకరించింది. రావల్పిండి చక్లాలోని నూర్ఖాన్, చక్వాల్లోని మురీద్, రహమీయార్ ఖాన్, షార్కోట్లోని రఫీకి, సియాల్కోట్ ఎయిర్ బేస్లు సహా రెండు రాడార్ బేస్లనూ ధ్వంసం చేసినట్టు తెలిపింది.