ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో అగ్నిప్రమాదం జరిగిందని మంటలార్పేందుకు వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ నెల 14వ తేదీన అగ్నిప్రమాదం జరగడంతో..మంటలార్పేందుకు వెళ్లిన సిబ్బందికి అనుకోకుండా అక్కడ భారీ ఎత్తున డబ్బు కనిపించింది. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో జస్టిస్ వర్మ నగరంలో లేరు. ఆయన కుటుంబసభ్యులే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు ఫోన్ చేసి పిలిపించారు. వారు అక్కడ అగ్నికీలలను ఆర్పేశాక.. అక్కడ భారీఎత్తున నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు దానిని స్వాధీనం చేసుకొన్నారు. అది మొత్తం లెక్కల్లో చూపని నగదుగా గుర్తించారు.
దీంతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ఖన్నా నేతృత్వంలోని కొలీజియం స్పందించి ఆయన్ను మరో హైకోర్టుకు బదిలీ చేసింది. ఈ ఘటన న్యాయవర్గాల్లో సంచలనం సృష్టించింది. వెంటనే ఈ విషయం ఉన్నతాధికారుల ద్వారా సీజేఐ ఖన్నాకు చేరింది. దీనిని తీవ్రంగా పరిగణించిన ఆయన, వెంటనే కొలీజియం సమావేశం ఏర్పాటుచేశారు. జస్టిస్ వర్మను అలహాబాద్కు బదిలీ చేయాలని నిర్ణయించారు.
అయితే ఐదుగురు సభ్యులున్న కొలీజియంలో కొందరు జస్టిస్ వర్మ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించారు. కేవలం ఈ జడ్జిని బదిలీ చేస్తే సరిపోదని, దీని వల్ల న్యాయశాఖ ఇమేజ్ తిరిగిరాదన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. వర్మను రాజీనామా చేయాలని కోరడమో లేదా ఆయనపై సీజేఐ అంతర్గత విచారణ చేపట్టడమో చేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.