భారీ వర్షానికి కుప్పకూలిన గోడ.. 10 మంది మృతి
Few Dead After Wall Collapses Due To Heavy Rain In Lucknow.భారీ వర్షానికి గోడ కూలి 10 మంది మృతి చెందారు.
By తోట వంశీ కుమార్
భారీ వర్షానికి గోడ కూలి 10 మంది మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో జరిగింది.
దిల్కుషా ప్రాంతంలోని ఆర్మీ ఎన్క్లేవ్ గోడను ఆనుకుని కొందరు కార్మికులు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. గడిచిన 24గంటలుగా ఆ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తూనే ఉంది. దీంతో గోడ నానిపోయి శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా కూలి గుడిసెలపై పడింది. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేసింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరింది. మృతుల్లో ముగ్గురు మహిళలు, మృగ్గురు చిన్నారులు ఉన్నారు.
Uttar Pradesh CM Yogi Adityanath announces an ex-gratia of Rs 4 lakh for those who died and Rs 2 lakh for the treatment of the injured https://t.co/jCESWfT5re
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 16, 2022
"కొంతమంది కార్మికులు దిల్కుషా ప్రాంతంలోని ఆర్మీ ఎన్క్లేవ్ వెలుపల గుడిసెలలో నివసిస్తున్నారు. రాత్రిపూట భారీ వర్షాల కారణంగా, ఆర్మీ ఎన్క్లేవ్ సరిహద్దు గోడ కూలిపోయింది" అని జాయింట్ పోలీస్ కమిషనర్ (లా అండ్ ఆర్డర్) పీయూష్ మోర్డియా తెలిపారు.ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షలు, క్షతగాత్రులకు రూ.2లక్షల సాయం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
ఇదిలాఉంటే.. లక్నోలో ఒక నెలలో కురవాల్సిన వర్షం మొత్తం ఒక్క రోజులోనే కురిసింది. నగరంలో గత 24 గంటల్లో 155.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అసాధారణంగా కురుస్తున్న వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏర్పడింది.