పొలంలో బావి కనిపించడం లేదు.. వెతికి పెట్టండి.. పోలీసుల‌కు ఫిర్యాదు

Farmer who complained that the well was stolen.అదేదో సినిమాలో త‌న పొలంలో చేప‌ల చెరువును ఎవ‌రో దొంగిలించారని..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 July 2021 6:46 AM GMT
పొలంలో బావి కనిపించడం లేదు.. వెతికి పెట్టండి.. పోలీసుల‌కు ఫిర్యాదు

అదేదో సినిమాలో త‌న పొలంలో చేప‌ల చెరువును ఎవ‌రో దొంగిలించారని.. అందులోని చేప‌ల‌న్నింటిని ఎవ‌రో ఎత్తుకెళ్లార‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తాడు. ఎలాగైనా పోలీసులు త‌న చేప‌ల చెరువును వెతికి ప‌ట్టుకోవాల‌ని పోలీసుల‌తో పాటు అధికారుల‌ను ముప్పుతిప్ప‌లు పెడ‌తాడు. అచ్చంగా అలాంటి ఘ‌ట‌న‌నే క‌ర్ణాట‌క రాష్ట్రంలో జ‌రిగింది. అయితే.. ఇక్క‌డ పోయింది చేప‌ల చెరువు కాదండి.. ఓ బావి.

వివ‌రాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం బెళగావి జిల్లాలోని భేండవాడ గ్రామ పంచాయతీ పరిధి మావినహొండ గ్రామంలో మ‌ల్ల‌ప్ప అనే రైతు త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తున్నాడు. కాగా.. మంగ‌ళ‌వారం అత‌డు తన పొలంలోని బావి కనిపించడం లేదని, ఎలాగైనా దానిని వెతికి పెట్టాలని రాయబాగ్‌ పోలీసు స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తొలుత రైతు ఇచ్చిన ఫిర్యాదు చూసి పోలీసులు షాక్‌కు గుర‌య్యారు. తీరా అస‌లు నిజం తెలుసుకుని ద‌ర్యాప్తు చేపట్టారు.

అసలు నిజం ఏమిటంటే.. మల్లప్ప పొలంలో బావిని తవ్వినట్టు పంచాయతీ అధికారులు రికార్డులు సృష్టించి, ప్రభుత్వ నిధులు కాజేశారు. అంతేకాక, బావి తవ్వించినందుకు తీసుకున్న రుణం తిరిగి చెల్లించాలంటూ రైతుకు నోటీసులు కూడా పంపారు. దీంతో విస్తుపోయిన రైతు పోలీసులను ఆశ్రయించడంతో అధికారుల బాగోతం బయటపడింది. ప్ర‌స్తుతం దీని పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story