భారతదేశాన్ని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తూ ఉండడంతో లాక్ డౌన్ ను అమలు చేశారు. పలు రాష్ట్రాల్లో ఇంకా లాక్ డౌన్ అమలవుతూనే ఉంది. అయితే గత కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ ఉండడంతో లాక్ డౌన్ సడలింపులపై రాష్ట్ర ప్రభుత్వాలు యోచిస్తూ ఉన్నాయి.
తాజాగా ఢిల్లీ ప్రభుత్వం అన్ లాక్ గురించి యోచిస్తోంది. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 1.5 శాతానికి తగ్గడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్ లాక్ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. మే 31 నుండి దేశ రాజధానిలో అన్ లాక్ మొదలు కాబోతూ ఉంది. మే 31 సోమవారం నాడు కొన్ని విభాగాలకు అనుమతులు లభించనున్నాయి. కన్స్ట్రక్షన్ రంగానికి, ఫ్యాక్టరీలకు అన్ లాక్ లో భాగంగా అనుమతులు ఇచ్చారు. ఎంతో మంది రోజు కూలీలు ఉపాధి పొందే అవకాశం ఉందని కేజ్రీవాల్ భావిస్తూ ఉన్నారు.
అలాగని చెప్పి అన్నిటికీ అనుమతులు ఇవ్వలేదని.. కేవలం కొన్ని రంగాలకు మాత్రమే పరిమితులు వర్తిస్తాయని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. పరిస్థితుల్లో మార్పులు వస్తే చాలా వాటికి గతంలో లాగా అనుమతులు మంజూరు చేస్తామని అన్నారు. అనవసరంగా మాత్రం ఇళ్ల నుండి బయటకు రావద్దని కేజ్రీవాల్ ప్రజలను కోరారు. 'పాజిటివిటీ రేట్ అన్నది 1.5 శాతం కంటే తక్కువకు వచ్చేసింది. గత 24 గంటల్లో ఢిల్లీలో 1100 కేసులు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ సోమవారం ఉదయం 5 గంటల వరకూ మాత్రమే అమలులో ఉంటుంది. ఢిల్లీలో అన్ లాక్ అన్నది మొదలు కాబోతోంది. రోజుకూలీలను మనసులో పెట్టుకుని ఫ్యాక్టరీలు, భవననిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నాము' అని కేజ్రీవాల్ తెలిపారు.