దారి దోపిడీలో ట్విస్ట్.. జంటకు రూ.100 ఇచ్చిన దొంగలు

రూ.20 ఉండటంతో దొంగలు షాక్‌ అయ్యారు. పాపం అని వారి దగ్గరున్న రూ.100 జంటకు ఇచ్చి వెళ్లిపోయారు.

By Srikanth Gundamalla  Published on  27 Jun 2023 10:29 AM GMT
Delhi, Thief, give money, Couple, viral Video

దారి దోపిడీలో ట్విస్ట్.. జంటకు రూ.100 ఇచ్చిన దొంగలు

దొంగలు రెచ్చిపోతున్నారు. ఈజీగా మనీ సంపాదించేందకు చైన్‌స్నాచింగ్‌లు.. దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో దారి దోపిడీకి యత్నించిన ఇద్దరు దొంగలకు ట్విస్ట్‌ ఎదురైంది. రోడ్డుపై వెళ్తున్న జంటను ఆపి డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. కానీ.. వారి దగ్గర కేవలం రూ.20 ఉండటంతో దొంగలు షాక్‌ అయ్యారు. పాపం అని వారి దగ్గరున్న రూ.100 జంటకు ఇచ్చి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఢిల్లీలోని ఫార్ష్‌ బజార్‌ ప్రాంతంలోని షాదారాలో మద్యం మత్తులో ఇద్దరు రోడ్డుపైకి వచ్చారు. వీధిలో వెళ్తున్న ఓ జంటను దోచుకోవాలని ప్రయత్నం చేశారు. వారి వద్ద బైక్‌ ఆపి.. గన్‌ తీసి వారిని బెదిరించారు. డబ్బులు ఇవ్వాలని లేదంటే చంపేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. అయితే.. దొంగల్లో ఒకరు వారి జేబులను వెతికాడు. అయితే.. అక్కడే ట్విస్ట్‌ ఎదురైంది దొంగలకు. వారి దగ్గర రూ.20 తప్ప మరేమీ లేవు. దొంగలు కంగుతిన్నారు. అంతేకాక వారి దుస్థితిని చూసి బాధపడ్డారో ఏమో.. వారి దగ్గర ఉన్న రూ.100 తీసి వారి చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ కామెంట్స్‌ పెడుతున్నారు. ఏదేమైనా ఆ సమయంలో జంట దగ్గర డబ్బులు లేకపోవడమే మంచి అయిందని.. వారి అదృష్టం బాగుండి అదనంగా రూ.100 లభించాయని కామెంట్స్‌ పెడుతున్నారు. దొంగలకు దయ ఉందంటూ మరొకందరు అంటున్నారు.

వీడియో వైరల్‌ కావడంతో.. పోలీసులు కూడా స్పందించారు. వీడియో ఆధారంగా ఇద్దరు నిందితులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పిస్టల్‌ తో పాటు బైక్‌, 30 మొబైల్‌ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ దొంగల వీడియో చూసిన చాలా మంది అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి పాట లిరిక్స్‌ను గుర్తు చేసుకుంటున్నారు.

Next Story