Delhi HC issues notice to Twitter over non-compliance of new IT rules. ఢిల్లీ హైకోర్టు ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కు షాక్ ఇచ్చింది.
By Medi Samrat Published on 31 May 2021 11:55 AM GMT
ఢిల్లీ హైకోర్టు ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కు షాక్ ఇచ్చింది. కేంద్రం నిబంధనలు ట్విట్టర్ పాటించడం లేదన్న పిటిషన్ పై సోమవారం కోర్టులో విచారణ జరిగింది. నూతన ఐటీ నిబంధనలు పాటిస్తున్నామని… గ్రీవెన్స్ అధికారిని సైతం నియమించినట్లు ట్విట్టర్ తెలిపింది. అయితే ట్విట్టర్ వాదనను కేంద్రం తప్పుబట్టింది. ఇరు పక్షాల వాదనలను విన్న జస్టిస్ రేఖ పల్లి.. ట్విటర్ కు నోటీసులు ఇచ్చారు. నూతన ఐటీ రూల్స్ ట్విట్టర్ పాటించాల్సిందేనని హైకోర్టు జడ్జీ ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశంపై తమ వైఖరి తెలపాలని కేంద్రంతో పాటు ట్విట్టర్ కు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేశారు.
ఇదిలావుంటే.. కేంద్రం తీసుకువచ్చిన నూతన ఐటీ నిబంధనలకు ఇప్పటికే ఫేస్బుక్ సహా పలు సోషల్ మీడియా, ఓటీటీ సంస్థలు ఈ నియమావళిని అంగీకరించాయి. అయితే వీటిలో కొన్ని మార్పులు చేయాలంటూ ప్రతిపాదనలు పెట్టాయి. ఈ విషయంలో ట్విట్టర్ యాజమాన్యం కాస్త మొండిగా వ్యవహరించింది. కొత్తగా తెచ్చిన ఐటీ చట్టాల్లో కొన్ని మార్పులు చేయాలన్న సూచన చేసింది. భావ స్వేచ్ఛకు విఘాతం ఏర్పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. భారత్ లోని తమ ఉద్యోగులు, వాక్ స్వాతంత్య్రంపై తాము ఆందోళన చెందుతున్నట్టు తెలిపింది.